భారత క్రికెట్ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మ్యాచ్ రిఫరీ అయిన జవగల్ శ్రీనాథ్ బెంగళూరు మెట్రో రైలులో సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఆగస్టు 29న తీసినట్లు చెబుతున్న ఈ ఫొటోను చూసిన క్రికెట్ అభిమానులు శ్రీనాథ్ సింప్లిసిటీని ప్రశంసిస్తున్నారు.
ఒకప్పుడు తన వేగవంతమైన బౌలింగ్తో ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్యాటర్లను సైతం ఇబ్బంది పెట్టిన శ్రీనాథ్.. ఇప్పుడు మెట్రో రైలులో సాధారణ దుస్తుల్లో, చేతిలో ప్రయాణ బ్యాగ్తో నిలబడి కనిపించారు.
ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా తోటి ప్రయాణికుల మాదిరిగానే ఆయన మెట్రోలో ప్రయాణించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.
శ్రీనాథ్ సింప్లిసిటీ అభిమానులకు కొత్తేమీ కాదు. గతంలో కూడా మైసూరు రైల్వే స్టేషన్లో వీపుపై బ్యాగ్తో సాధారణ ప్రయాణికుడిలా రైలు కోసం ఎదురుచూస్తున్న ఆయన ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇప్పుడు మెట్రోలో ప్రయాణిస్తున్న ఫొటో కూడా అభిమానుల నుంచి మంచి స్పందనను అందుకుంటోంది. క్రికెట్లో ఎన్నో ఘనతలు సాధించినప్పటికీ, శ్రీనాథ్ ఇప్పటికీ తన సాధారణ జీవనశైలిని కొనసాగిస్తున్నారని అభిమానులు ప్రశంసిస్తున్నారు.
మైసూరుకు చెందిన జవగల్ శ్రీనాథ్ భారత జట్టు తరఫున 67 టెస్టుల్లో 236 వికెట్లు, 229 వన్డేల్లో 315 వికెట్లు సాధించారు. 1992 నుంచి 2003 వరకు జరిగిన నాలుగు ప్రపంచకప్ టోర్నమెంట్లలోనూ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.
క్రికెట్కు వీడ్కోలు పలికిన అనంతరం ఆయన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మ్యాచ్ రిఫరీగా సేవలందిస్తున్నారు.
క్రికెట్లో ఎన్నో రికార్డులు, ఘనతలు సాధించినప్పటికీ.. సాధారణ జీవితాన్ని గడపడం కూడా ఒక ప్రత్యేకతేనని జవగల్ శ్రీనాథ్ తాజా మెట్రో ప్రయాణం మరోసారి అభిమానులకు గుర్తుచేసింది.

Leave a Reply