జార్ఖండ్ రాష్ట్రం, పలాము జిల్లా, మేదినీనగర్ ప్రాంతంలో జరిగిన ఒక ఉత్సవంలో భిక్షాటన చేస్తున్న ఇద్దరు బాలుర కడుపుపై, ముఖ్యంగా కిడ్నీలు ఉండే ప్రాంతంలో శస్త్రచికిత్స చేసినట్లుగా ఉన్న కోత గుర్తులు (scars) తీవ్ర కలకలం రేపాయి.
ఈ విషయంపై సమాచారం అందుకున్న బాలల సంక్షేమ సమితి (Child Welfare Committee), చైల్డ్ హెల్ప్లైన్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు బాలురను రక్షించి బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఆ సమయంలో వారితో పాటు ఉన్న మరో బాలుడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయినట్లు సమాచారం.
రక్షించబడిన బాలురను ప్రాథమికంగా విచారించగా, తాము ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీర్జాపూర్ ప్రాంతానికి చెందినవారమని, తమ బంధువులతో కలిసి భిక్షాటన చేస్తున్నామని వారు తెలిపారు. భిక్షాటన ద్వారా వచ్చిన డబ్బులో ఎక్కువ భాగాన్ని తమతో వచ్చిన వారు తీసుకుంటారని బాలురు చెప్పినట్లు సమాచారం. ఈలోగా, బీహార్ రాష్ట్రం గయా జిల్లాకు చెందిన ఒక జంట, ఆ ఇద్దరు బాలురు తమ కుమారులేనని తెలుపుతూ బాలల సంక్షేమ సమితిని ఆశ్రయించారు. దీంతో బాలుర గుర్తింపు, వారి కుటుంబ నేపథ్యంపై అధికారులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనలో ప్రధానంగా తలెత్తుతున్న ప్రశ్న… బాలుర కడుపుపై ఉన్న ఆ కోత గుర్తులు ఎలా వచ్చాయి? బాలల సంక్షేమ సమితి సభ్యుల ప్రకారం, ఆ గుర్తులు కిడ్నీలు ఉండే ప్రాంతంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే, అవి ఏదైనా అనారోగ్యం కారణంగా చేసిన వైద్య చికిత్స వల్ల వచ్చాయా లేదా మరేదైనా కారణమా అనేది ఇంకా నిర్ధారించబడలేదు. ఒక బాలుడు తన కడుపులో కణితి (tumor) ఉందని, మరో బాలుడు కిడ్నీలో రాళ్ల సమస్యకు చికిత్స తీసుకున్నానని వేర్వేరు సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది.
దీనిని తీవ్రంగా పరిగణించిన అధికారులు, ఇద్దరు బాలురకు పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఒక వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. వారి శరీరాలపై ఉన్న కోత గుర్తులకు అసలు కారణం ఏమిటి? ఏదైనా వైద్య చికిత్స జరిగిందా? వారి శరీరంలోని అవయవాలన్నీ సురక్షితంగా ఉన్నాయా? అనే విషయాలను వైద్యులు పరిశీలించనున్నారు. అవయవాల అక్రమ రవాణా జరిగినట్లు ఇప్పటివరకు ఎలాంటి ఖచ్చితమైన ఆధారాలు లభించలేదని, వైద్య నివేదిక, సమగ్ర విచారణ తర్వాతే నిజానిజాలు బయటపడతాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో బాలల సంక్షేమ సమితి అన్ని కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేసింది.

Leave a Reply