భోపాల్: మధ్యప్రదేశ్లో నిలిచి ఉన్న రైలులో మంటలు చెలరేగాయనే వార్త కార్చిచ్చులా వ్యాపించింది. దీంతో రైలులోని ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకునేందుకు హడావిడిగా కిందికి దిగి పక్కనే ఉన్న రైల్వే ట్రాక్పైకి దూకారు. సరిగ్గా అదే సమయంలో ఆ ట్రాక్పై వేగంగా వచ్చిన మరో రైలు వారిని ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రం మొరేనా జిల్లాలోని హేతంపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈరోజు సాయంత్రం ఖజురహో-ఉదయ్పూర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ (రైలు నంబర్ 19665) ఆగింది. ఎదురుగా వచ్చే రైలుకు దారి ఇవ్వడం కోసం (క్రాసింగ్) ఈ రైలును ట్రాక్పై నిలిపి ఉంచారు.
ఆ సమయంలో రైలులో అగ్నిప్రమాదం జరిగిందనే వార్త ప్రయాణికుల్లో కలకలం రేపింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు భోగీల నుండి అత్యవసరంగా కిందికి దిగారు. మరికొందరు రైలు తలుపులు మరియు ఎమర్జెన్సీ విండోల నుండి కిందికి దూకేశారు.
ఇలా అగ్నిప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నామని భావించి పక్క ట్రాక్పైకి దూకిన వారిపైకి.. అదే సమయంలో ఫిరోజ్పూర్-సియోనీ పాతాళకోట్ ఎక్స్ప్రెస్ (20424) వేగంగా దూసుకొచ్చింది. కనురెప్పపాటు కాలంలోనే ఆ రైలు పట్టాలపై ఉన్న వారిని ఢీకొట్టింది.
ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు:
ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడి మరణించగా, మరికొందరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), రైల్వే పోలీసులు మరియు స్థానిక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణకు రైల్వే యంత్రాంగం ఆదేశించింది.
ప్రాథమిక విచారణలో ఖజురహో-ఉదయ్పూర్ ఇంటర్సిటీ రైలులో అగ్నిప్రమాదం జరగలేదని, అది కేవలం వదంతు (పుకారు) మాత్రమేనని తేలింది. తప్పుడు వార్తను నమ్మి ప్రాణాలు కాపాడుకోవడానికి రైలు నుండి కిందకు దూకిన నలుగురు ప్రయాణికులు మరో రైలు కింద పడి మరణించడం అందరినీ కలిచివేసింది.

Leave a Reply