కృష్ణగిరి జిల్లా తళి పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్లాపురం గ్రామంలో చోటుచేసుకున్న కిరాతక హత్య ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.
కూలీ పనులు చేసుకునే నారాయణస్వామి (39) భార్య విద్య (30). వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే, అదే గ్రామానికి చెందిన పునీత్ అనే వ్యక్తితో విద్యకు వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త పలుమార్లు హెచ్చరించినా, గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టి నచ్చజెప్పినా పెడచెవిన పెట్టిన విద్య.. తన వివాహేతర బంధాన్ని కొనసాగిస్తూనే వచ్చింది.
ఈ క్రమంలో కుటుంబానికి దూరంగా వెళ్లిపోవాలని పథకం వేసిన విద్య.. మాటలతో మభ్యపెట్టి భర్త పేరిట ఉన్న 8 సెంట్ల భూమిలో 1,500 చదరపు అడుగుల స్థలాన్ని తన పేరిట రాయించుకుంది. అనంతరం ఆ భూమిని రూ.22 లక్షలకు విక్రయించి, ఆ నగదుతో పాటు కన్నబిడ్డలను, భర్తను నడిరోడ్డుపై వదిలేసి ప్రియుడితో కలిసి కర్ణాటకలోని ఆనేకల్కు పారిపోయి తలదాచుకుంది. పిల్లల భవిష్యత్తు కోసం దాచుకున్న ఆస్తి పోయి, భార్య కూడా మోసం చేసి వెళ్లిపోవడంతో నారాయణస్వామి తీవ్ర ఆక్రోశం, మానసిక క్షోభతో రగిలిపోయాడు.
ఇలా ఉండగా, భూమి అమ్మిన డబ్బును బ్యాంక్ ఖాతా నుంచి డ్రా చేసుకునేందుకు విద్య తిరిగి గుమ్లాపురం గ్రామంలోని బ్యాంకుకు వచ్చింది. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న నారాయణస్వామి.. ఆ డబ్బును పిల్లల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని డిమాండ్ చేయడంతో ఇద్దరి మధ్య నడిరోడ్డుపై తీవ్ర వాగ్వాదం చెలరేగింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన నారాయణస్వామి, రోడ్డు పక్కన ఉన్న పెద్ద బండరాయిని తీసుకుని విద్యపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు.
ప్రాణభయంతో పరుగులు తీసిన భార్యను వెంటాడి పట్టుకుని.. తల, శరీరంపై బండరాయితో మోది అత్యంత కిరాతకంగా హతమార్చాడు. తీవ్ర రక్తస్రావమైన విద్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న తేన్కనికోట్టై పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు; పారిపోవడానికి ప్రయత్నించిన నారాయణస్వామిని అరెస్ట్ చేశారు. క్షణికానందం కోసం పెట్టుకున్న అక్రమ సంబంధం, డబ్బు వ్యామోహం కారణంగా కన్నతల్లి శవమై, తండ్రి జైలుపాలు కావడంతో ఆ ముగ్గురు పసిపిల్లలు అనాథలుగా మారిన తీరు స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

Leave a Reply