మధ్యప్రాచ్య దేశాల మధ్య యుద్ధం కారణంగా చమురు రవాణా తీవ్రంగా దెబ్బతిన్నది. ఇరాన్ హోర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) మూసివేయడంతో, అరబ్ దేశాలు తమ చమురు మరియు సహజ వాయువును ఎగుమతి చేయలేక స్తంభించిపోయాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆఫ్రికాలోని ఒక దేశం తనకు అనుకూలంగా మలచుకుంటోంది.
ప్రపంచానికి ఊపిరితిత్తుల వంటి హోర్ముజ్ జలసంధి మూతపడటం వల్ల ప్రపంచ దేశాలన్నీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. సహజ వాయువుకు రారాజు అయిన ఖతార్, ముడి చమురుకు పేరొందిన సౌదీ అరేబియా ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డాయి. ఇటీవలే ‘జాఫురా’ (Jafurah) ప్రాజెక్ట్ ద్వారా గ్యాస్ లాభాలను రుచి చూడాలని ఆశించిన సౌదీకి కూడా ఇప్పుడు అన్ని దారులు మూసుకుపోయాయి.
ఆఫ్రికాలో విశ్వరూపం!
ఖతార్, సౌదీలను నమ్ముకున్న ఐరోపా మరియు ఆసియా దేశాలు ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకుతున్నాయి. ఈ క్లిష్ట పరిస్థితిని ఆఫ్రికా దేశమైన నైజీరియా తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. ఆఫ్రికా ఖండంలోనే అత్యధిక గ్యాస్ నిల్వలున్న దేశం నైజీరియా. సరైన పెట్టుబడులు లేక ఇన్నాళ్లూ వెనుకబడిన ఆ దేశం, ఇప్పుడు బ్రిటన్తో జరిపిన చర్చల ద్వారా కొత్త ఆశలను చిగురింపజేస్తోంది.
$20 బిలియన్ల మెగా ప్లాన్: మూడు దేశాల మీదుగా పైప్లైన్!
నైజీరియా రూపొందించిన ప్రణాళిక సామాన్యమైనది కాదు. సుమారు 20 బిలియన్ డాలర్ల వ్యయంతో ఒక భారీ గ్యాస్ పైప్లైన్ను నిర్మించాలని నిర్ణయించారు.
- మార్గం: నైజీరియాలో మొదలై చాద్ (Chad), లిబియా మీదుగా ఇటలీలోని సిసిలీకి (Sicily) చేరుకుంటుంది.
- లక్ష్యం: ఏడాదికి 30 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ను నేరుగా ఐరోపాకు తరలించడం.
పెట్టుబడులు లేక భూమిలోనే మగ్గిపోతున్న నైజీరియా సహజ వాయువు బయటకు వస్తే, ప్రపంచ ఇంధన మార్కెట్ చిత్రపటమే మారిపోతుంది. ఈ మెగా ప్రాజెక్ట్ కోసం నైజీరియా ప్రభుత్వం పన్ను రాయితీలను కూడా భారీగా ప్రకటించింది.
అయితే, పనులు ఇప్పుడే మొదలైనా గ్యాస్ సరఫరా వెంటనే జరగదు. రాబోయే 3-4 ఏళ్లలో నైజీరియా ఆర్థికంగా పెద్ద ఎత్తున లాభపడే అవకాశం ఉంది. సాధారణంగా చమురు ఉన్న చోట అమెరికా ఉంటుంది అంటారు.. ఆ క్రమంలో ఆఫ్రికాలో కూడా అమెరికా అడుగుపెడుతుందా అనేది వేచి చూడాలి!
