కొచ్చి: మోడలింగ్ పేరుతో సెక్స్ రాకెట్ నడుపుతూ, యువతులను మానవ అక్రమ రవాణాకు గురి చేస్తున్న కేసులో ప్రధాన నిందితురాలు సింధుకు చెందిన వాట్సాప్ చాట్ స్క్రీన్షాట్లు బయటకు వచ్చాయి. ఈ చాట్లో ఆమె వినియోగదారులకు (Customers) యువతుల ఫోటోలను పంపి, వారితో డీల్ కుదుర్చుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
పోలీసుల అదుపులో సింధు
మంబై నుంచి ఢిల్లీకి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా ముంబై విమానాశ్రయంలో సింధును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను ఈరోజు పోలీసులు క్షుణ్ణంగా విచారించనున్నారు. ఇది ఒక క్రూరమైన, వ్యవస్థీకృత నేరమని, దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించామని కొచ్చి సిటీ పోలీస్ కమిషనర్ కాళిరాజ్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ రాకెట్లో మరికొంతమంది ప్రముఖులకు సంబంధం ఉందేమో కూడా విచారిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
దుబాయ్లో ఫ్యాషన్ షో పేరుతో మోసం
మోడలింగ్ పేరుతో యువతులను బురిడీ కొట్టించడంలో సింధు కీలకపాత్ర పోషించిందని పోలీసులు వెల్లడించారు. దుబాయ్లో ఫ్యాషన్ షో ఉందని, మోడలింగ్ శిక్షణ, ఉద్యోగ అవకాశాలు, ఆడంబరమైన హోటల్ బస వంటి మాయమాటలతో సింధు యువతులను దుబాయ్కు రప్పించేది. విసా ఏర్పాట్ల నుండి అన్ని సౌకర్యాలు ఆమెనే చూసుకునేది.
ఇప్పటివరకు అరెస్టులు..
ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితురాలు సింధు (దుబాయ్లో ఈవెంట్ మేనేజ్మెంట్), తిరువనంతపురానికి చెందిన అలీనా అబ్రహం, పొన్నానికి చెందిన మంజిమలు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.
బాధితురాలి ఆవేదన..
ఇటీవల ఒక యువతి తనపై జరిగిన అమానుషాన్ని బయటపెట్టింది. తన పానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చి, రోజులు తరబడి లైంగికంగా వేధించారని, పీడన దృశ్యాలను తన బంధువులకు పంపిస్తామని బెదిరించారని ఆమె వాపోయింది.
