ఒక చిన్న కుటుంబ కలహం ఎంతటి ఘోరానికి దారితీస్తుందో చెప్పడానికి జార్ఖండ్ నుంచి వచ్చిన ఈ విషాద వార్తే నిదర్శనం.
జార్ఖండ్ రాష్ట్రంలోని లుబుంగ్ గ్రామానికి చెందిన ఆకాష్ కుమార్, నిరాలీ దేవి భార్యాభర్తలు. ఘటన జరిగిన రోజు.. ఇంట్లోని కుళ్లిపోయిన బంగాళాదుంపలను బయట పారవేయడంపై నిరాలీ దేవికి, ఆమె అత్త శాంతి దేవికి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది.
ఆ సమయంలో పని ముగించుకుని ఇంటికి వచ్చిన భర్త ఆకాష్ కుమార్.. ఆ చిన్న గొడవను చూసి విపరీతమైన ఆగ్రహానికి లోనయ్యాడు. ఇంట్లో నిద్రిస్తున్న తన 6 నెలల పసికందు ‘అన్ష్’పై ఆ కోపాన్ని చూపించాడు. విచక్షణ కోల్పోయిన ఆ తండ్రి.. చిన్నారిని చేతుల్లోకి తీసుకుని ఇంటి వెనుక ఉన్న బావి వైపు వెళ్లాడు.
అక్కడ ఎవరెంత బతిమాలినా వినకుండా, తీవ్ర ఆవేశంతో ఊగిపోతూ తన 6 నెలల సొంత బిడ్డనే నేలకేసి బలంగా బాదాడు. కనురెప్పపాటులో జరిగిన ఈ కిరాతక దాడిలో పసికందు తీవ్రంగా గాయపడింది. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న బిడ్డను చూసి తల్లడిల్లిపోయిన తల్లి నిరాలీ దేవి.. వెంటనే ఆసుపత్రికి తరలించింది.
అక్కడ చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం రాంచీ ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. అయితే, రాంచీకి తీసుకెళ్లే మార్గమధ్యంలోనే ఆ పసికందు కన్నుమూసింది.
ఈ ఘోర వార్త ఆ గ్రామం మొత్తాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. గుండెలవిసేలా రోదించిన తల్లి నిరాలీ దేవి.. భర్త ఆకాష్ కుమార్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడైన తండ్రి ఆకాష్ కుమార్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటనలో కుటుంబంలోని ఇతర సభ్యుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలోనూ పోలీసులు సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.

Leave a Reply