పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో మానవ సంబంధాల పవిత్రతను ప్రశ్నించే అత్యంత కిరాతక హత్యోదంతం వెలుగుచూసింది.
సత్తారి ప్రాంతంలో తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తోందన్న కారణంతో భార్య గొంతు కోసి దారుణంగా హత్య చేసిన భర్తతో పాటు, అతని ప్రియురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హత్యకు గురైన మహిళను 25 ఏళ్ల షీలా బీబీగా గుర్తించారు. ఆమెకు మొజమ్మిల్తో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. మొజమ్మిల్ ఇతర రాష్ట్రాలకు వెళ్లి పనిచేసే వలస కార్మికుడు. వీరికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.
పోలీసుల విచారణలో, గత కొన్ని నెలలుగా మొజమ్మిల్కు వరుసకు వదిన అయ్యే ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. ఈ విషయం తెలుసుకున్న షీలా బీబీ భర్త అక్రమ సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో దంపతుల మధ్య రోజూ గొడవలు, గృహ కలహాలు జరుగుతున్నాయి. ఘటన జరిగిన రోజున కూడా ఇదే విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన మొజమ్మిల్, తాను దాచిపెట్టిన పదునైన ఆయుధంతో షీలా గొంతు కోసి విచక్షణారహితంగా హతమార్చాడు.
భార్యను చంపిన తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా, రక్తపు మడుగులో ఉన్న ఆమె మృతదేహాన్ని బెడ్రూమ్లోని మంచం కింద దాచిపెట్టాడు. అయితే, వారి ప్రవర్తనపై చుట్టుపక్కల వారికి తీవ్ర అనుమానం వచ్చింది. స్థానికులు లోపలికి వెళ్లి చూడగా, మంచం కింద తల తెగిపడిన స్థితిలో ఉన్న షీలా మృతదేహం కనిపించడంతో హతాశులయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply