కడలూరు జిల్లా వేపూర్ సమీపంలోని ఒరంగూర్ గ్రామానికి చెందిన విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) పార్టీ స్థానిక నేత ఇళయరాజా, ఆగస్టు 12న ఓ బావిలో అనుమానాస్పద స్థితిలో శవమై తేలడం కలకలం రేపింది.
ఈ మృతిపై సిరుపాక్కం పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఇళయరాజా భార్య అశ్వినిత ప్రవర్తనపై అనుమానం రావడంతో, ఆమె ఫోన్ కాల్ డేటా, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. దీంతో అశ్వినితకు, ఇళయరాజా పిన్ని కొడుకైన వెంకటేశన్కు మధ్య ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణమని బట్టబయలైంది.
ఘటన జరిగిన రోజు మద్యం సేవిస్తున్న సమయంలో తన భార్యతో ఉన్న అక్రమ సంబంధం గురించి ఇళయరాజా నిలదీయడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన వెంకటేశన్, ఇళయరాజాపై దాడి చేసి అతడిని అపస్మారక స్థితిలోకి చేర్చాడు. అనంతరం తన స్నేహితుడైన సెల్వం సహాయంతో, స్పృహలేని స్థితిలో ఉన్న ఇళయరాజాను ఒరంగూర్ ప్రాంతానికి తీసుకెళ్లి బావిలో పడేసి ప్రాణాలు తీశారు.
అంతేకాకుండా, ఇదొక ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఆయన ద్విచక్ర వాహనాన్ని కూడా బావి సమీపంలోనే వదిలిపెట్టారు. ఈ హత్య ప్రణాళికను, అమలును వెంకటేశన్ ఎప్పటికప్పుడు అశ్వినితకు ఫోన్ ద్వారా లైవ్ అప్డేట్గా చేరవేసినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో వెంకటేశన్, అతనికి సహకరించిన సెల్వం, భర్త హత్యకు సహకరించిన భార్య అశ్వినితను పోలీసులు అరెస్టు చేశారు.

Leave a Reply