ఇజ్రాయెల్పై ఇరాన్ ఒక భారీ ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయంపై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసిన తర్వాత ఇరాన్ సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. నెతన్యాహు భవిష్యత్తు అస్పష్టంగా ఉందని, ఈ దాడికి సంబంధించిన విజయవంతమైన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఇరాన్ పేర్కొంది.
సోమవారం నాడు టెల్ అవీవ్లోని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయాన్ని విజయవంతంగా లక్ష్యంగా చేసుకున్నట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) క్లెయిమ్ చేసింది. అయితే, దాడి జరిగిన సమయంలో 76 ఏళ్ల నెతన్యాహు కార్యాలయంలో ఉన్నారా లేదా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. “నేరస్థుడైన ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం మరియు వాయుసేన కమాండర్ స్థావరాలపై ‘ఖైబర్ షెకాన్’ బాలిస్టిక్ క్షిపణులతో 10వ విడతలో ఆకస్మిక దాడులు చేశాం” అని IRGC తెలిపింది.
ఐరన్ డోమ్ను కూడా ముప్పుతిప్పలు పెట్టే క్షిపణి
ఈ దాడిలో వాడినట్లు చెబుతున్న క్షిపణికి ఒక ప్రత్యేకత ఉంది. దీనిని మొబైల్ లాంచర్ ద్వారా కూడా ప్రయోగించవచ్చు. అత్యంత కీలకమైన విషయం ఏంటంటే, ఈ క్షిపణి తన ప్రయాణం చివరి దశలో కూడా దిశను మార్చుకోగలదు. దీనివల్ల శత్రువుల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ దీనిని అడ్డుకోవడం (Intercept) దాదాపు అసాధ్యం. ఇజ్రాయెల్ వద్ద ఉన్న ‘ఐరన్ డోమ్’ వ్యవస్థ క్షిపణులను గాలిలోనే అడ్డుకోగలదని అందరికీ తెలుసు, కానీ 2,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని తాకగల ఈ క్షిపణిని ఐరన్ డోమ్ కూడా అడ్డుకోలేదని సమాచారం.
గల్ఫ్లో యుద్ధ మేఘాలు! దుబాయ్, అబుదాబి విమానాలు రద్దు
ప్రధాని కార్యాలయంపై జరిగిన దాడి అత్యంత కచ్చితత్వంతో కూడినదని, ఇజ్రాయెల్కు భారీ నష్టం వాటిల్లిందని IRGC వాదిస్తోంది. ఈ ప్రకటన తర్వాత ఇజ్రాయెల్ నుండి ఎటువంటి ప్రతిస్పందన వస్తుందా అని ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. దుబాయ్, అబుదాబి విమానాలు రద్దయ్యాయని, అమెజాన్ డేటా సెంటర్లు ధ్వంసమయ్యాయని కూడా వార్తలు వస్తున్నాయి.

Leave a Reply