వేగంగా బరువు తగ్గాలనే తీవ్ర ప్రయత్నం, చైనాకు చెందిన 31 ఏళ్ల మహిళకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను తెచ్చిపెట్టినట్లు సమాచారం వెలువడింది.
హెనాన్ ప్రావిన్స్కు చెందిన ఆ మహిళ వరుసగా 15 రోజుల పాటు ఎలాంటి ఆహారం తీసుకోకుండా కేవలం నీళ్లు మాత్రమే తాగినట్లు తెలిసింది. దీని ద్వారా ఆమె కొన్ని వారాల్లోనే సుమారు 20 కిలోల బరువు తగ్గింది.
అయితే బరువు తగ్గిన తర్వాత ఆమెకు నడవడంలో తీవ్ర ఇబ్బంది, జ్ఞాపకశక్తి మందగించడం, శరీర సమతుల్యత (Balance) కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తాయి. ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించగా, ఆమె ‘వెర్నికే ఎన్సెఫలోపతి’ (Wernicke Encephalopathy) అనే తీవ్రమైన నాడీ సంబంధిత (Neurological) రుగ్మతతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. శరీరంలో విటమిన్ బి1 (థయామిన్) తీవ్రంగా లోపించడం వల్ల ఈ వ్యాధి వస్తుంది.
వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళ సరిగ్గా నడవలేక పెంగ్విన్ పక్షిలా అటూ ఇటూ ఊగుతూ నడిచే పరిస్థితికి చేరింది. ఈ నరాల బలహీనత లేదా మెదడు సంబంధిత సమస్య పూర్తిగా నయం కాకపోవచ్చని న్యూరాలజిస్ట్ డాక్టర్ సన్ గుయ్ఫాంగ్ హెచ్చరించారు.
ఈ మహిళ ఆహారాన్ని పూర్తిగా మానేసే పురాతన సంప్రదాయ ‘బిగు’ (Bigu) పద్ధతిని అనుసరించినట్లు సమాచారం. అయితే ఎక్కువ రోజుల పాటు ఆహారాన్ని పూర్తిగా విడిచిపెట్టడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు అందక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి వేగంగా బరువు తగ్గాలనే ఆశతో వైద్యుల సలహా లేకుండా ఇలాంటి ప్రమాదకరమైన కఠిన ఉపవాసాలు చేయడం ప్రాణాంతకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply