మధ్యప్రదేశ్ రాయ్సేన్ జిల్లాలోని ఒక గ్రామంలో వ్యవసాయ భూమి సమీపంలో రక్తపు మడుగులో పడి ఉన్న జువల్ కిషోర్ రఘువంశీ అనే వ్యక్తి హత్య కేసు మిస్టరీగా మారగా, దాన్ని పోలీసులు ఛేదించారు.
మృతి చెందిన వ్యక్తికి, హంతకుడి భార్యకు మధ్య అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఇద్దరు సోదరులు కలిసి ఈ ఘాతకానికి ఒడిగట్టారు. జువల్ కిషోర్ను వ్యవసాయ భూమి సమీపంలో అడ్డుకుని తీసుకెళ్లిన ఆ సోదరులు, చేతికి దొరికిన గొడ్డలి, కర్రతో కనుమూసి తెరిచేలోగా దాడి చేసి దారుణంగా హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది.
ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి, సాక్షులను విచారించడం ద్వారా పోలీసులు నిందితులను గుర్తించారు. ఇందులో అరవింద్ మెహ్రా, దీపక్ మెహ్రా అనే ఇద్దరు సోదరులపై పోలీసులకు అనుమానం బలపడింది. వారిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, భార్యతో మాట్లాడిన కోపంలో పథకం ప్రకారం హత్య చేసిన నిజాన్ని వారు అంగీకరించారు.
అనంతరం నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన గొడ్డలి, కర్రను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన ఇద్దరినీ కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఒక ఫోన్ కాల్, అనుమానం కారణంగా ఇద్దరు సోదరులు కలిసి చేసిన ఈ దారుణ హత్య ఆ ప్రాంత ప్రజలలో తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది.

Leave a Reply