ఒక అనుమానాస్పద స్మూతీ, మరొక మహిళకు పదేపదే చేసిన ఫోన్ కాల్స్, డిలీట్ చేసిన మెసేజ్లు, మరియు ప్రాథమిక విచారణను తలకిందులు చేసిన పోస్టుమార్టం నివేదిక.. అమెరికాలో ఒక తెలంగాణ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను తన భార్య హత్య కేసులో నిందితుడిగా నిలబెట్టాయి. వివాహం జరిగిన కొద్ది నెలలకే ఈ దారుణం చోటుచేసుకోవడం కలకలం రేపింది.
అక్టోబర్ 27, 2025న వాషింగ్టన్లోని బెల్లెవ్యూలో ఉన్న తమ అపార్ట్మెంట్లో 27 ఏళ్ల రాజితా సబ్బినేనిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 30 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవినాష్ నార్నేను అమెరికా అధికారులు అరెస్టు చేశారు.
పోస్టుమార్టంలో బయటపడిన నిజం ప్రారంభంలో ఇది ఒక మెడికల్ ఎమర్జెన్సీ కేసుగా కనిపించింది. తాను పని మీద బయటకు వెళ్లి తిరిగి రాగా, భార్య బాత్రూమ్లో లాక్ చేసుకుని స్పృహ లేకుండా పడి ఉందని అవినాష్ 911కి ఫోన్ చేశాడు. రెస్క్యూ టీమ్స్ తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి సీపీఆర్ (CPR) చేయడానికి ప్రయత్నించినా, రాజితా అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. అయితే, వైద్య పరీక్షల నివేదికలో ఆమె గొంతు నులమడం వల్ల శ్వాస ఆడక మరణించిందని (strangulation) తేలడంతో, పోలీసులు దీనిని హత్య కేసుగా మార్చారు.
రహస్య కాల్స్ మరియు భార్య మృతదేహం ఫోటో అవినాష్ డిజిటల్ ఫుట్ప్రింట్ను పరిశీలించిన డిటెక్టివ్లకు, భారతదేశంలోని ఒక మహిళతో అతనికి సంబంధం ఉన్నట్లు ఆధారాలు లభించాయి. వివాహం తర్వాత కూడా వారు మాట్లాడుకుంటున్నారని, రాజితా మరణించిన రోజున కూడా అతను ఆ మహిళకు అనేకసార్లు ఫోన్ చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా, రాజితా మృతదేహం ఫోటోను ఆ మహిళకు పంపినట్లు కూడా అవినాష్ అంగీకరించినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఘటన తర్వాత అతను మెసేజ్లను డిలీట్ చేశాడని కూడా గుర్తించారు. జూన్ 5, 2025న జరిగిన వీరి వివాహానికి సదరు మహిళ కూడా హాజరైనట్లు అధికారులు భావిస్తున్నారు.
‘స్మూతీకి దగ్గు మందు రుచి’ రాజితా మరణానికి ముందు రోజుల్లో తన సన్నిహిత స్నేహితురాలితో చేసిన సంభాషణలు కేసులో కీలకంగా మారాయి. భర్త తయారు చేసిన స్మూతీకి అసాధారణమైన రుచి ఉందని ఆమె పదేపదే ఫిర్యాదు చేసేది. తను చనిపోయిన రోజున కూడా “ఈ పానీయం దగ్గు మందులా ఉంది” అని అవినాష్కు మెసేజ్ చేసింది. ఈ మెసేజ్లు ఆమె మరణానికి దారితీసిన పరిస్థితులను విశ్లేషించడంలో కీలక ఆధారాలుగా మారాయి.
అవినాష్కు ఆ మహిళతో ఉన్న సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణమని దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు, అయితే తుది కారణాన్ని ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. పెళ్లయిన నాలుగు నెలలకే భార్యను హత్య చేసిన కేసులో ఈ ఆధారాలన్నీ అవినాష్ను ప్రధాన నిందితుడిగా నిలబెట్టాయి.
