జైపూర్: 65 ఏళ్ల వైద్యుడు 100 మందికి పైగా మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడని అతని వద్ద పనిచేస్తున్న ఒక నర్స్ తీవ్ర ఆరోపణలు చేసింది.
ఆసుపత్రికి వచ్చే మహిళలను బెదిరించి అత్యాచారం చేశాడని, దీనికి ఆసుపత్రిలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు సహకరించారని ఆమె ఆరోపించింది.
రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలో, 65 ఏళ్ల వైద్యుడి నుండి రూ. 2 కోట్లు వసూలు చేశారనే ఆరోపణపై అరెస్టు అయిన నర్స్, కోర్టులో హాజరుపరిచే ముందు విడుదల చేసిన వీడియోలో కొన్ని షాకింగ్ ఆరోపణలు చేసింది. ఆ వైద్యుడు 100 మందికి పైగా మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది.
రూ. 2 కోట్లు
వైద్యుడి వ్యక్తిగత ఫోటోలను బయటపెడతానని బెదిరించి, నకిలీ లైంగిక వేధింపుల కేసులో ఇరికిస్తానని చెప్పి ఆ నర్స్ రూ. 2 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి సదరు వైద్యుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నర్స్ను అరెస్టు చేశారు. విచారణ నిమిత్తం ఆమెను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు, కోర్టు ఉత్తర్వుల మేరకు జైలుకు తరలించారు. అయితే కోర్టులోకి వెళ్లేముందు ఆ వైద్యుడిపై సదరు నర్స్ పలు షాకింగ్ ఆరోపణలు చేసింది.
100+ మంది మహిళలు
ఆ వీడియోలో ఆమె, “అతను నంబర్ వన్ లైంగిక నేరస్థుడు. గత కొన్నేళ్లుగా 100 మందికి పైగా మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తన ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన మహిళా రోగులను కూడా లైంగికంగా వేధించాడు. అంతేకాకుండా, గతంలో కొందరు మహిళలు వైద్యుడికి వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. కానీ డబ్బు ఇచ్చి ఆ కేసులన్నింటినీ మూసివేశారు.
అతనిపై ఉన్న లైంగిక కేసులను దాచిపెట్టి దృష్టి మళ్లించడానికే నాపై అబద్ధపు ఫిర్యాదు చేశారు. ఇందులో అతనికి మాత్రమే కాకుండా మరికొందరికి కూడా సంబంధం ఉంది. ఆసుపత్రిలో పనిచేసే మరో ఇద్దరు ఉద్యోగులే మహిళలను వైద్యుడి వద్దకు తీసుకెళ్తున్నారు” అని పేర్కొంది. ఈ వీడియో సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపింది. అదే సమయంలో ఆ నర్స్ చేసిన ఆరోపణల్లో దేనినీ పోలీసులు ఇప్పటివరకు ధృవీకరించలేదు.
నేపథ్యం
వైద్యుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు ప్రారంభమైంది. గత 2016 నుండి తన ప్రైవేట్ ఆసుపత్రిలో నైట్ షిఫ్ట్ నర్స్గా పనిచేస్తున్న ఆ మహిళ, తనను బెదిరించినట్లు తెలిపారు. అందులో ఆయన, “ఆ నర్స్ ఒకసారి నా గదికి వచ్చింది. అప్పుడు నా సెల్ఫోన్ను అన్లాక్ చేసి దానిలోని నా ప్రైవేట్ ఫోటోలను రహస్యంగా తన మొబైల్కు బదిలీ చేసుకుంది.
ఆ తర్వాత, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో బయటపెడతానని, నకిలీ లైంగిక కేసులో ఇరికిస్తానని చెప్పి ఏళ్లుగా డబ్బులు గుంజుతోంది. నా పేరుకు, ఆసుపత్రి ప్రాభావానికి భంగం కలుగుతుందనే భయంతో నిరంతరం డబ్బులు ఇస్తూ వచ్చాను” అని తెలిపారు.
వైద్యుడి ఫిర్యాదు
ఆ నర్స్ ఇప్పటివరకు రూ. 2 కోట్ల వరకు బెదిరించి గుంజినట్లు ఆ వైద్యుడు ఫిర్యాదు చేశారు. ఇందులో సుమారు రూ. 35 లక్షలు వైద్యుడి వ్యక్తిగత మరియు ఆసుపత్రి బ్యాంక్ ఖాతాల నుండి ఆన్లైన్ ద్వారా పంపినట్లు పోలీసులు తెలిపారు. ఇది మాత్రమే కాకుండా చెక్కులు, ఖాళీ బాండ్ పేపర్పై సంతకాలు చేయించుకుని బెదిరిస్తున్నట్లు కూడా ఆ వైద్యుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆ నర్స్ ఎల్లప్పుడూ తనను పర్యవేక్షిస్తుండేదని కూడా వైద్యుడు ఆరోపించారు. ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాల ద్వారా తన కదలికలను నిరంతరం పర్యవేక్షించేదని, ప్రత్యేకంగా ఒక మొబైల్ ఫోన్, సిమ్ కార్డ్ కొనిచ్చి, దాని ద్వారా హఠాత్తుగా ఫోన్ చేసి డబ్బులు అడిగేదని ఫిర్యాదు చేశారు.
పోలీసుల విచారణ
ఈకు సంబంధించి ప్రస్తుతం రెండు కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఒకవైపు బెదిరించి డబ్బులు గుంజారనే వైద్యుడి ఫిర్యాదు ఆధారంగా విచారణ జరుగుతోంది. మరోవైపు నర్స్ చేసిన అత్యాచార ఆరోపణలపై కూడా పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు.

Leave a Reply