స్మార్ట్ఫోన్ వాడకంలో తాను పాటించే కఠినమైన సైబర్ సెక్యూరిటీ జాగ్రత్తల గురించి టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున వెల్లడించిన విషయాలు అభిమానులను, నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
హైదరాబాద్లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన సైబర్ అవగాహన సదస్సులో పాల్గొన్న ఆయన, హ్యాకింగ్ భయం వల్ల తాను మొబైల్లో ఫొటోలు, సెల్ఫీలు సైతం దాచుకోనని ఓపెన్గా చెప్పారు.
ఒక సెలబ్రిటీగా ఉండటం వల్ల తన స్మార్ట్ఫోన్ ఎప్పుడూ హ్యాకర్ల కన్నుల్లో పడే ప్రమాదం ఉంటుందనే భయం తనకు నిత్యం ఉంటుందని నాగార్జున పేర్కొన్నారు. అందుకే తన మొబైల్లో ఎలాంటి వ్యక్తిగత ఫొటోలు, సెల్ఫీలను సేవ్ చేయకుండా జాగ్రత్త పడతానని తెలిపారు.
అంతేకాకుండా, సైబర్ సేఫ్టీ కోసం తన మొబైల్ పాస్వర్డ్ను ప్రతి 15 రోజులకోసారి, ఇంట్లోని వైఫై (Wi-Fi) పాస్వర్డ్ను ప్రతినెలా లేదా రెండు నెలలకోసారి తప్పకుండా మారుస్తుంటానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.
గతంలో తనకు వచ్చిన నకిలీ బ్యాంక్ కాల్ (స్కామ్ కాల్), అలాగే తన బంధువు ఒకరు ‘డిజిటల్ అరెస్ట్’ ఫ్రాడ్ బారిన పడబోయిన చేదు అనుభవాలను పంచుకుంటూ.. ఈ డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
“నాలాంటి సెలబ్రిటీలకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, ఇక అమాయక వృద్ధుల పరిస్థితి ఏంటి?” అని ప్రశ్నించిన ఆయన, ప్రజలంతా తమ వ్యక్తిగత సమాచారం, పాస్వర్డ్ల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్న తరుణంలో నాగార్జున తీసుకుంటున్న ఈ ముందస్తు జాగ్రత్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి.
