జపాన్లో గత 18 సంవత్సరాలుగా ఇండియన్ రెస్టారెంట్ నడుపుతున్న ఒక భారతీయ వ్యాపారవేత్త కథ దేశవ్యాప్తంగా ప్రజలను తీవ్రంగా కలచివేస్తోంది. జపాన్లోని సైతామా ప్రిఫెక్చర్ (Saitama Prefecture) లో నివసిస్తున్న మనీష్ కుమార్ అనే భారతీయుడి ‘బిజినెస్ మేనేజర్ వీసా’ (Business Manager Visa) ను పొడిగించడానికి జపాన్ అధికారులు నిరాకరించారు. దీనితో ఆయన తన రెస్టారెంట్ను శాశ్వతంగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
టోక్యోలో నిర్వహించిన ఒక నిరసన ప్రదర్శనలో మనీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ బోరున విలపించారు. తన పిల్లలు జపాన్లోనే పుట్టి పెరిగారని, వారికి జపనీస్ భాష మాత్రమే తెలుసని.. అయినప్పటికీ తమ కుటుంబాన్ని భారతదేశానికి తిరిగి వెళ్లిపోవాలని అధికారులు ఆదేశిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తర్వాత జపాన్ యొక్క కొత్త ఇమ్మిగ్రేషన్ విధానాలపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
‘నా పిల్లల ఇల్లు జపాన్ మాత్రమే’
నిరసనల సందర్భంగా మనీష్ కుమార్ మాట్లాడుతూ.. రెండు వారాల క్రితం జపాన్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ ఏజెన్సీ (ISA) నుండి తమకు దేశం విడిచి వెళ్లాలనే నోటీసులు వచ్చినట్లు తెలిపారు. ఆయన ఎంతో భావోద్వేగానికి లోనవుతూ.. “నా పిల్లలు జపాన్లోనే పుట్టారు, ఇక్కడే పెరిగారు. వారి స్నేహితులంతా జపనీయులే, వారికి కేవలం జపనీస్ భాష మాత్రమే వచ్చు. ఇప్పుడు మమ్మల్ని భారత్కు తిరిగి వెళ్లిపోమంటున్నారు. నా కుటుంబంతో నేను ఎక్కడికి వెళ్లాలి? ఏం చేయాలి?” అని ప్రశ్నించారు.
సంవత్సరాల తరబడి కష్టపడి తాము ఈ వ్యాపారాన్ని నిర్మించుకున్నామని, కానీ అధికారుల ఒక్క నిర్ణయం తమ జీవితాలను రోడ్డున పడేసిందని మనీష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈయన కథనం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
జపాన్ కొత్త నిబంధనలతో పెరిగిన ఇబ్బందులు
నివేదికల ప్రకారం.. జపాన్ ప్రభుత్వం అక్టోబర్ 2025లో ‘బిజినెస్ మేనేజర్ వీసా’కు సంబంధించిన నిబంధనలను అత్యంత కఠినతరం చేసింది. కొందరు వ్యక్తులు నిజమైన వ్యాపారాలు చేయకుండా, జపాన్లో ఎక్కువ కాలం నివసించడానికి ఈ వీసాను ఒక సులువైన మార్గంగా వాడుకుంటున్నారని ప్రభుత్వం భావించింది.
అయితే, ఈ కొత్త నిబంధనల వల్ల నిజాయితీగా చిన్న వ్యాపారాలు చేసుకునే చిన్న తరహా వ్యాపారవేత్తలు తీవ్రంగా నష్టపోతున్నారని విశ్లేషకులు చెప్తున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం.. కొత్త రూల్స్ అమలులోకి వచ్చిన తర్వాత బిజినెస్ మేనేజర్ వీసా దరఖాస్తులు 96 శాతం మేర భారీగా పడిపోయాయి. గతంలో ప్రతి నెలా దాదాపు 1700 దరఖాస్తులు వచ్చేవి, కానీ ఇప్పుడు ఆ సంఖ్య కేవలం 70 కి పరిమితమైంది.
విదేశీ వ్యాపారులలో పెరుగుతున్న భయాందోళనలు
మనీష్ కుమార్ ఉదంతం ఇప్పుడు జపాన్లో నివసిస్తున్న ఇతర విదేశీ వ్యాపారవేత్తలను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. తాము ఎన్నో ఏళ్లుగా జపాన్ ఆర్థిక వ్యవస్థకు (Economy) తోడ్పాటు అందిస్తున్నామని, కానీ ఈ కొత్త పాలసీల వల్ల తమ భవిష్యత్తు అభద్రతలో పడిపోయిందని పలువురు చిన్న వ్యాపార యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకవైపు విదేశీ పెట్టుబడులను, వ్యాపారాలను ప్రోత్సహించాలని జపాన్ కోరుకుంటున్నప్పటికీ.. మరోవైపు ఇలాంటి కఠినమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనల వల్ల విదేశీ పారిశ్రామికవేత్తలలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మనీష్ కుమార్ మరియు అతని కుటుంబం తమ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
