ప్రముఖ గాయకుడు, యూట్యూబర్ అయిన 32 ఏళ్ల అంకిత్ బల్యాన్ (Ankit Balyan).. షామ్లీ జిల్లాలోని ఓ జిమ్ వెలుపల గుర్తుతెలియని దుండగుల చేతిలో దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.
సిటీ కొత్వాలీ పరిధిలోని ఆర్యపురి నాలా పత్రీ సమీపంలో సాయంత్రం 7 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిమ్ నుంచి బయటకు వచ్చి తన స్కార్పియో కారు వైపు వెళ్తున్న అంకిత్పై.. రెండు బైకులపై వచ్చిన నలుగురు వ్యక్తుల ముఠా దాదాపు 18 రౌండ్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. కారు తలుపు తెరిచి అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో, ఆయన తల మరియు పొట్ట భాగంలోకి 5 బుల్లెట్లు దూసుకెళ్లాయి. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఈ ఘోర హత్యతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత, నిరసనలు వెల్లువెత్తాయి. హంతకులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అంకిత్ కుటుంబసభ్యులు, మద్దతుదారులు ఢిల్లీ-ముజఫర్నగర్ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. మరణించిన కొడుకు తలను ఒడిలో పెట్టుకుని తల్లి గుండెలవిసేలా రోదించిన దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టించాయి. యూట్యూబ్లో 3.66 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లను కలిగి ఉన్న అంకిత్, తన పాటలు మరియు స్టేజ్ షోలతో మంచి గుర్తింపు పొందారు. 2023లో జరిగిన ఒక ర్యాలీ వివాదం, స్థానిక రాజకీయాల్లోకి ఆయన రాక వంటి కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ హత్య వెనుక రాజకీయ కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం మీరట్ జోన్ ఏడీజీ భాను భాస్కర్, ఎస్పీ ఎం.పి. సింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పరారీలో ఉన్న నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

Leave a Reply