జార్ఖండ్ రాష్ట్రం చత్రా జిల్లాలో పాఠశాల విద్యార్థిని కిడ్నాప్కు గురై లైంగిక దాడికి గురైనట్లు చెబుతున్న సంఘటన తీవ్ర కలకలాన్ని రేపింది.
రెండు రోజులుగా విద్యార్థిని కనిపించకపోవడంతో, ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు పలు ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఎలాంటి సమాచారం లభించలేదు. ఈ క్రమంలో, విద్యార్థిని హఠాత్తుగా ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత జరిగిన విషయాలను కుటుంబ సభ్యులకు తెలిపినట్లు సమాచారం.
మొహమ్మద్ ఇమ్రోజ్ (32) అనే వ్యక్తి తనను తన ఇంట్లో రెండు రోజుల పాటు బంధించి లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, జరిగిన విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బెదిరించినట్లు ఆ విద్యార్థిని వాంగ్మూలంలో ఆరోపించింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి, ఆగ్రహానికి గురయ్యారు. దీంతో పెద్ద సంఖ్యలో జనం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంటిని ముట్టడించి దాడి చేసినట్లు తెలుస్తోంది.
గుంపు చేసిన దాడిలో మొహమ్మద్ ఇమ్రోజ్ మృతి చెందాడు. సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి విచారణ ప్రారంభించారు. ఈ గుంపు దాడితో ప్రమేయం ఉన్నట్లు ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, విద్యార్థిని ఇచ్చిన కిడ్నాప్, లైంగిక దాడి ఆరోపణలపై కూడా విడిగా తీవ్ర విచారణ జరుపుతున్నారు.
ఈ సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఒకవైపు విద్యార్థిని తెలిపిన లైంగిక దాడి ఆరోపణపై పోలీసులు విచారణను వేగవంతం చేయగా, మరోవైపు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని గుంపుగా దాడి చేసిన ఘటనపై కూడా ప్రత్యేక కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నారు. రెండు ఘటనల నిజానిజాలను వెలికితీసేందుకు అధికారులు నిరంతరం విచారణ జరుపుతున్నారు.

Leave a Reply