గర్భాశయం లోపల పెరగాల్సిన కణజాలం (టిష్యూ), వెలుపల పెరగడం వల్ల మహిళలకు ఎదురయ్యే ఒక తీవ్రమైన సమస్యే ‘ఎండోమెట్రియోసిస్’ (Endometriosis).
ఈ సమస్యతో బాధపడే మహిళల్లో టైప్-2 డయాబెటిస్ (మధుమేహం) వచ్చే ప్రమాదం 46 శాతం ఎక్కువగా ఉంటుందని అమెరికాలోని జార్జ్ మేసన్ విశ్వవిద్యాలయ తాజా పరిశోధనలో దిగ్భ్రాంతికర విషయం వెల్లడైంది.
1996 నుండి 2021 వరకు దాదాపు 30 లక్షల మంది మహిళలపై నిర్వహించిన ఈ సుదీర్ఘ అధ్యయనం తాలూకు ఫలితాలు తాజాగా వెలువడ్డాయి. ఎండోమెట్రియోసిస్ కారణంగా శరీరంలో ఏర్పడే దీర్ఘకాలిక మంట/వాపు (క్రానిక్ ఇన్ఫ్లమేషన్), ఇన్సులిన్ పనితీరును అడ్డుకుని ఇన్సులిన్ నిరోధకతకు (ఇన్సులిన్ రెసిస్టెన్స్) దారితీస్తుంది. ఇదే కాలక్రమేణా షుగర్ వ్యాధి రావడానికి ప్రధాన కారణమవుతోందని పరిశోధకులు గుర్తించారు.
ముఖ్యంగా మెనోపాజ్కు ముందు దశలో ఉన్న మహిళల్లో మరియు అధిక బరువు (ఊబకాయం) లేని వారిలో కూడా ఈ మధుమేహ ముప్పు అధికంగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. దీనిని బట్టి ఈ వ్యాధి మహిళల ప్రత్యుత్పత్తి వ్యవస్థను మాత్రమే కాకుండా, వారి మొత్తం శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీసే స్వభావం కలదని స్పష్టమవుతోంది.
కాబట్టి, ఎండోమెట్రియోసిస్ ఉన్న మహిళలు తాము బరువు పెరగలేదని లేదా లావుగా లేమని నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న సమయంలోనే ఎప్పటికప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలను కూడా పరీక్షించుకోవడం చాలా ముఖ్యం.
ఎండోమెట్రియోసిస్ బారిన పడిన మహిళలు ప్రారంభంలోనే షుగర్ పరీక్షలు చేయించుకుని, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సకాలంలో గుర్తించి సరైన ఆహార నియమాలు మరియు జీవనశైలి మార్పులను పాటించడం ద్వారా మహిళలు ఈ డయాబెటిస్ ముప్పు నుంచి తమను తాము కాపాడుకోవచ్చు.

Leave a Reply