మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) నిర్వహించిన డ్రగ్ ఇన్స్పెక్టర్ (ఔషధ నిరీక్షకులు) పరీక్షలో జరిగిన పేపర్ లీక్ వ్యవహారం, దాని వెనుక బయటపడిన ట్రయాంగిల్ లవ్ థ్రిల్లర్ కథ ఆ రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
తన ప్రియురాలు ఎలాగైనా ప్రభుత్వ అధికారి కావాలనే ఆశతో, ఒక ప్రియుడు అక్రమ మార్గంలో ప్రశ్నాపత్రాన్ని దొంగిలించి ఆమెకు అందజేసి సహాయం చేశాడు.
ఆ ప్రశ్నాపత్రం చదువుకున్న ప్రియురాలు ఏకంగా రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంకు సాధించి రికార్డు సృష్టించింది. అయితే, ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రియురాలు తనను వదిలేసి వెళ్లిపోతుందేమోనన్న భయం, వారి మధ్య వచ్చిన తీవ్ర విభేదాల వల్ల కోపంతో రగిలిపోయిన సదరు ప్రియుడు.. MPSC అధికారులకు రహస్యంగా సమాచారం అందించి ఫిర్యాదు చేయడంతో ఈ పేపర్ లీక్ బాగోతం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు జరిపిన ముమ్మర దర్యాప్తులో.. ప్రభుత్వ పరీక్షా బోర్డు ఉద్యోగులు, కోచింగ్ సెంటర్ డైరెక్టర్ సహా ఆరుగురికి ఇందులో ప్రమేయం ఉన్నట్లు తేలింది. లక్షలాది రూపాయలు చేతులు మారి, నిపుణులతో అత్యంత పకడ్బందీగా రూపొందించిన రహస్య ప్రశ్నాపత్రాలను చోరీ చేసి ఆ యువతికి కట్టబెట్టినట్లు బట్టబయలైంది.
ఇందులో కొసమెరుపు ఏమిటంటే.. పేపర్ లీక్ అయిందంటూ అధికారులకు ఫిర్యాదు చేసి ‘విజిల్బ్లోయర్’గా నాటకమాడిన అదే ప్రియుడిని, చివరకు నేరానికి ప్రధాన సూత్రధారిగా గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రేమ విఫలమైనందుకు రగిలిన పగ, ప్రతీకారాలు మొత్తం పరీక్షా వ్యవస్థలోని డొల్లతనాన్ని బట్టబయలు చేశాయి. ఈ కుంభకోణం కారణంగా 44,000 మందికి పైగా నిజాయితీపరులైన అభ్యర్థుల భవిష్యత్తు అంధకారంలో పడటంతో, MPSC ఆ పరీక్షను పూర్తిగా రద్దు చేసింది.
“ప్రియురాలిపై గుడ్డి మోహంతో ఒకడు చేసిన నేరం, ప్రేమ ముగియగానే అతడిని జైలు పాలు చేయడమే కాకుండా.. వేలాది మంది విద్యార్థుల కష్టాన్ని, జీవిత కలలను చిదిమేసింది” అని సామాజిక కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply