లక్నో: “పాములను రక్షించే క్రమంలో ఒక 6 అడుగుల జెర్రిపోతు (రాట్ స్నేక్) నన్ను కరిచింది. అయినప్పటికీ నేను ఎంతమాత్రం ఆందోళన చెందకుండా, వెంటనే ఆసుపత్రికి వెళ్లి ఇంజెక్షన్ చేయించుకున్నాను. ఇప్పుడు నేను పూర్తిగా సురక్షితంగా ఉన్నాను” అంటూ ఉత్తరప్రదేశ్కు చెందిన 22 ఏళ్ల ధైర్యశాలి యువతి నజ్రున్ నిషా సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. ఆమె ధైర్యసాహసాలపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
స్థానిక ప్రజలచే ‘అడవి రాణి’ (ఫారెస్ట్ క్వీన్) మరియు ‘రెస్క్యూ ఉమెన్’ అని ప్రేమగా పిలవబడే నిషా.. దుధ్వా జాతీయ పార్కులో (Dudhwa National Park) మోటివేటర్గా పనిచేస్తోంది. ఆమె ఇప్పటివరకు 100కు పైగా పాములను, 10కి పైగా మొసళ్లను రక్షించి అటవీ ప్రాంత గ్రామ ప్రజలకు ఒక రక్షకురాలిగా నిలిచింది.
కరిచినా వదల్లేదు.. ధైర్యంగా పట్టి బంధించింది:
తన 19 ఏళ్ల వయసు నుంచే చిన్న చిన్న పాములను పట్టడం ప్రారంభించిన నిషా.. ప్రస్తుతం ఎంతటి ప్రమాదకరమైన విషసర్పాలనైనా నైపుణ్యంతో రక్షిస్తోంది. ఇటీవల ఒక గ్రామంలో 6 అడుగుల పొడవైన జెర్రిపోతు పామును సురక్షితంగా పట్టుకుంటుండగా, అది ప్రమాదవశాత్తూ ఆమె చేతిపై కరిచింది. అయినా సరే ఆమె ఏమాత్రం పట్టు సడలించకుండా, ధైర్యంగా ఆ పామును పట్టి బోనులో బంధించింది.
ఈ ఘటన తర్వాత ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రజలకు ఒక కీలక విజ్ఞప్తి చేసింది. “పాము కరిచినప్పుడు ఎవరూ మంత్రగాళ్లను నమ్మి, చేతబడులు, మూఢనంబకాల వెంట పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. పాము కాటుకు గురైన వెంటనే ఆలస్యం చేయకుండా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి సరైన చికిత్స (యాంటీ స్నేక్ వెనమ్) తీసుకోవాలి” అని ఆమె కోరిన అవగాహన సందేశం ప్రస్తుతం నెటిజన్ల మనసులను గెలుచుకుంటోంది.

Leave a Reply