E100 ఫ్యూయల్ వస్తోంది.. ప్రభుత్వం భారీ ఏర్పాట్లు, ఇక సిద్ధమైపోండి!

కృత్రిమంగా పెరుగుతున్న ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరల మధ్య, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 100% ఇథనాల్‌తో వాహనాలను నడిపించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ‘ఎకనామిక్ టైమ్స్’ కథనం ప్రకారం.. ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం రాబోయే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 5,000 ఇథనాల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను (ఫ్యూయల్ పంప్‌లు) ఏర్పాటు చేయబోతోంది.

ఈ కేంద్రాలలో ‘E100 ఫ్లెక్స్ ఫ్యూయల్’ విక్రయించబడుతుంది. E100 ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటే 100% స్వచ్ఛమైన ఇథనాల్‌తో కూడిన ఇంధనం. ప్రస్తుతం భారతదేశంలో విక్రయిస్తున్న పెట్రోల్‌లో 20% ఇథనాల్‌ను (E20) మిక్స్ చేస్తున్నారు.

ఈ పరిణామంతో సంబంధం ఉన్న విశ్వసనీయ వర్గాలు ఎకనామిక్ టైమ్స్‌కు తెలిపిన వివరాల ప్రకారం.. మే 4వ తేదీన ప్రభుత్వం మొదటిసారిగా ఆటోమొబైల్ మరియు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (OMCs) ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించింది. ఇందులో ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ (FFV) నడపడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) ఎలా సిద్ధం చేయాలో వారికి వివరించారు.

దేశంలోని ప్రముఖ ద్విచక్ర (టూ వీలర్), నాల్గవ చక్రాల (ఫోర్ వీలర్) వాహన తయారీ సంస్థలు ఇప్పటికే ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల యొక్క ‘ప్రోటోటైప్’ (నమూనాలు) సిద్ధం చేసినట్లు నివేదిక పేర్కొంది. అయితే, మార్కెట్లో E100 ఫ్యూయల్ పంప్‌ల కొరత మరియు E100 ఇంధన ధరలపై స్పష్టత లేకపోవడం వల్లే కంపెనీలు ఈ వాహనాలను ఇంకా అధికారికంగా లాంచ్ చేయలేదని ఆటోమొబైల్ రంగ నిపుణులు చెబుతున్నారు.

ఈ సరికొత్త పంప్‌లు ఎక్కడెక్కడ ప్రారంభం కానున్నాయి?
రాబోయే 6 నెలల నుండి ఏడాది కాలంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్ మరియు మహారాష్ట్రలలో తమ పరిధిని విస్తరించడంతో పాటు, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా మరియు హైదరాబాద్ నగరాలలో కూడా మౌలిక సదుపాయాలను విస్తరించనున్నట్లు సమాచారం. ఈ కాల వ్యవధిలో దేశవ్యాప్తంగా 500 E100 రిటైల్ అవుట్‌లెట్లను (పంప్‌లను) అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత, 24 నెలల లోపు ఈ సంఖ్యను 5,000 రిటైల్ అవుట్‌లెట్లకు పెంచనున్నారు. పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ప్రణాళిక ప్రకారం.. రాబోయే ఒక నెలలోనే ఢిల్లీ, ముంబై, పుణె మరియు నాగపూర్‌లలో 150 ఇథనాల్ పంప్‌లు ప్రారంభం కానున్నాయి.

దేశానికి ఎన్ని వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది?
ఈ నివేదిక ప్రకారం, ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల వాడకం పెరిగితే ముడి చమురు దిగుమతుల భారం తగ్గి భారతదేశానికి భారీగా విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్ రిజర్వ్స్) ఆదా అవుతుంది. ఆర్థిక సంవత్సరం 2026 లో భారతదేశం విదేశాల నుండి ఏకంగా రూ. 10.9 లక్షల కోట్ల విలువైన చమురును కొనుగోలు చేసింది.

ఇండియన్ షుగర్ అండ్ బయోఎనర్జీ మాన్యుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ (ISMA) డైరెక్టర్ జనరల్ దీపక్ బల్లానీ మాట్లాడుతూ.. “భారతదేశానికి ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తాయి. భారత్ ప్రతి ఏటా దాదాపు 85-90% ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. అదే 100% ఇథనాల్‌ను భారతదేశంలోనే ఉత్పత్తి చేస్తే, దీనివల్ల దేశంలోని దాదాపు 7-8 కోట్ల మంది రైతులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుంది” అని అన్నారు.

అయితే, ప్రస్తుతం పూర్తి స్థాయి ఇథనాల్ ఇంధనానికి మార్కెట్లో డిమాండ్ చాలా తక్కువగా ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) సీనియర్ అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం.. కంపెనీ పైలట్ ప్రాజెక్ట్ కింద దాదాపు 400 రిటైల్ అవుట్‌లెట్లలో E100 ఇంధన విక్రయాలను ప్రారంభించినప్పటికీ, ఆశించిన స్థాయిలో డిమాండ్ రాలేదు. ఈ కారణంగానే కంపెనీ తన E100 పంప్‌ల సంఖ్యను భారీగా తగ్గించుకోవాల్సి వచ్చింది. మరోవైపు, సాధారణ పెట్రోల్ ధర కంటే E100 ఇంధనం ధరను 30% తక్కువగా ఉంచాలని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) ప్రభుత్వానికి సూచించింది.


Posted

in

by

Tags: