భోపాల్లో మరణించిన 33 ఏళ్ల త్విషా శర్మ కేసులో దర్యాప్తు జరుగుతున్న తరుణంలో, ఆమెకు సంబంధించిన ఒక కొత్త వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ఈ క్లిప్లో త్విషా తన ఇంట్లో భక్తి పాటలకు నవ్వుతూ డాన్స్ చేస్తూ, తన పెంపుడు రాట్వీలర్ కుక్కతో ఎంతో ఆప్యాయంగా ఆడుకుంటూ కనిపించింది.
ఈ వీడియోలో ఆమె ఎంతో ఉల్లాసంగా, ప్రశాంతంగా కనిపిస్తుండటంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఆమె మానసిక స్థితి బాగోలేదని లేదా మాదకద్రవ్యాలకు బానిసయ్యిందని ఆమె అత్తమామలు చేసిన ఆరోపణలను ఈ వీడియో తప్పుపడుతోందని నెటిజన్లు వాదిస్తున్నారు.
సోషల్ మీడియా స్పందన
వీడియో చూసిన నెటిజన్లు భావోద్వేగంతో స్పందిస్తున్నారు. “వివాహం ఆమె జీవితాన్ని నాశనం చేసింది”, “అంత సంతోషంగా ఉన్న వ్యక్తికి ఇలా జరగడం బాధాకరం”, “ఒకరు కష్టాల్లో ఉన్నంత మాత్రాన ఎప్పుడూ ఏడుస్తూనే ఉండాలని లేదు కదా” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
త్విషా శర్మ కేసులో కొత్త ఆరోపణలు
ఈ వీడియో వైరల్ అవుతుండగానే, కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. త్విషా మరణించిన మరుసటి రోజు, ఆమె అత్త, రిటైర్డ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి గిరిబాల సింగ్.. న్యాయ వ్యవస్థకు చెందిన పలువురు వ్యక్తులతో సహా అనేకమందికి ఫోన్ కాల్స్ చేశారని త్విషా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మే 13న నివాసంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి కూడా కాల్స్ జరిగినట్లు వారు అనుమానిస్తున్నారు. కాల్ రికార్డులను, కమ్యూనికేషన్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ముఖ్యమంత్రికి కుటుంబ సభ్యుల వినతి
ఈ కేసులో న్యాయం జరగాలని కోరుతూ త్విషా శర్మ కుటుంబ సభ్యులు భోపాల్లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ను కలిశారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని వారు కోరగా, ప్రభుత్వం నుండి పూర్తి సహకారం ఉంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు సమాచారం.
మరోవైపు, రెండోసారి పోస్ట్మార్టం నిర్వహించేందుకు అనుమతి రావాల్సి ఉంది. భోపాల్లోని ఏ వైద్య కేంద్రంలోనూ మృతదేహాన్ని ఎక్కువ కాలం భద్రపరిచేందుకు అవసరమైన ‘అల్ట్రా-లో టెంపరేచర్’ నిల్వ సౌకర్యాలు లేవని అధికారులు పేర్కొన్నారు. కట్న వేధింపులు, అనుమానాస్పద గాయాలు మరియు ఫోరెన్సిక్ పారదర్శకత డిమాండ్లతో ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
