దుబాయ్లో నివసించే భారతీయ కుబేరుల విలాసవంతమైన జీవనశైలిని ప్రతిబింబిస్తూ నెట్ఫ్లిక్స్లో విడుదలైన ‘దేసీ బ్లింగ్’ (Desi Bling) అనే రియాలిటీ షో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
ఈ షోలో దుబాయ్కి చెందిన ధనిక దంపతులు సతీష్ సన్పాల్ మరియు అతని భార్య తబిందా సన్పాల్ల జీవనశైలి నెటిజన్లను ఆగ్రహానికి గురిచేస్తోంది. షో మొదటి ఎపిసోడ్లో తబిందా మాట్లాడుతూ, “నేను ప్రతిరోజూ ఉదయం నా భర్త సతీష్ పాదాలను నొక్కుతాను. భర్త పాదాలను తాకితే ఇంట్లో లక్ష్మీ కటాక్షం పెరుగుతుందని ఆయన నమ్ముతారు” అని గొప్పగా చెప్పుకుంది. అంతేకాకుండా, భర్త గోళ్లు కత్తిరించడమే నిజమైన ప్రేమ అని చెబుతూ, షోలో పాల్గొన్న ప్రముఖ నటి తేజస్వి ప్రకాశ్ను కూడా అలా చేయమని అడిగింది. దీనికి తేజస్వి ముఖం తిప్పుకుని, “నేను ఇవన్నీ చేయలేను” అని నిర్మొహమాటంగా తిరస్కరించింది.
మరోవైపు సతీష్, తనకు ఇతర మహిళలతో పార్టీలు చేసుకోవడం ఇష్టమని, మహిళలు తనను చూడటమే గొప్ప విషయమని షోలో బహిరంగంగా వ్యాఖ్యానించాడు. దీనిని సమర్థిస్తూ తబిందా, “నా భర్తకు మహిళలతో సమయం గడపడం ఇష్టం. మొదట్లో నాకు అసూయ కలిగినా, ఇప్పుడు నేను అతన్ని నమ్ముతున్నాను” అని చెప్పడం చూసేవారిని షాక్కు గురిచేసింది.
అంతేకాకుండా, తన వద్ద 40 కిలోల బంగారం ఉందని, ప్రతి ఏటా తన భర్త తనకు 3 కిలోల బంగారాన్ని బహుమతిగా ఇస్తాడని తబిందా గొప్పలు చెప్పుకుంది. ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు, “2026లో కూడా ఇలాంటి ఆలోచనలా? ఎంత డబ్బున్నా సరే, ఈ ఛాందస భావాలు మారవా? ఈ షో మహిళలను బానిసలుగా చూపే ఆధిపత్య ధోరణిని పెంచుతోంది” అని సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
