ఫతేపూర్ (ఉత్తరప్రదేశ్): పెళ్లి వేడుకలో సంతోషకరమైన వాతావరణం ఉన్న సమయంలో, వధువు తీసుకున్న ఒక్క నిర్ణయం అందరినీ షాక్కు గురిచేసింది. ఏడు ఫేర్లు పూర్తి కాకముందే ఆ పెళ్లిని రద్దు చేసుకుని, తన ప్రేమికుడితోనే జీవిస్తానని ఆమె భీష్మించుకుంది.
అసలేం జరిగింది? ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ జిల్లా, ఔంగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో ఈ వివాహం జరగాల్సి ఉంది. బిందకీ కోత్వాలి ప్రాంతం నుండి వరుడు ఘనంగా బారాత్తో చేరుకున్నాడు. అందరూ ఆశించినట్లుగానే ద్వారపూజ, వరమాల వంటి వేడుకలు సంతోషంగా పూర్తయ్యాయి. వాతావరణం ఎంతో ఉల్లాసంగా సాగుతున్న సమయంలో, పెళ్లికూతురు అకస్మాత్తుగా పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
జరగని పెళ్లి, వీడని మొండితనం: ఈ అకస్మాత్తు నిర్ణయంతో ఇరు కుటుంబాలు అయోమయానికి గురయ్యాయి. కుటుంబ సభ్యులు ఆమెను ఎంతగా బతిమిలాడినా, నచ్చజెప్పినా ఆమె వినిపించుకోలేదు. తనను బలవంతం చేస్తే ఏకంగా ‘విషం తాగి చచ్చిపోతానని’ ఆమె హెచ్చరించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పక్కింటి యువకుడితో తనకు గత కొంతకాలంగా ప్రేమ ఉందని, తన ప్రేమికుడిని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోనని ఆమె తెగేసి చెప్పింది.
సద్దుమణిగిన గొడవ: పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న వరుడి కుటుంబం, పెళ్లిని రద్దు చేసుకుని బారాత్ను వెనక్కి తీసుకువెళ్లాలని నిర్ణయించుకుంది. మరోవైపు, వధువు కుటుంబ సభ్యులు కూడా పరిస్థితిని బేరీజు వేసుకుని, ఆమెను ఆమె ప్రేమికుడి ఇంటికి పంపించేందుకు అంగీకరించారు.
పోలీసుల వివరణ: ఈ ఘటనపై ఔంగ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రమా శంకర్ సరోజ్ స్పందిస్తూ, “ఇది పూర్తిగా ప్రేమ వ్యవహారానికి సంబంధించిన కేసు. ఇద్దరు యువతీ-యువకులు మేజర్లు కావడంతో, రెండు కుటుంబాల మధ్య చర్చలు జరిపి పెద్దల సమక్షంలో సయోధ్య కుదిర్చాము. ప్రస్తుతం ఎటువంటి గొడవలు లేవు, పరిస్థితి ప్రశాంతంగా ఉంది” అని వెల్లడించారు.
