మేరఠ్ హత్యోదంతం: ఉత్తరప్రదేశ్లోని మేరఠ్లో ఒక తండ్రి కసాయిగా మారాడు. తన 16 ఏళ్ల కూతురు ఫోన్లో ఒక అబ్బాయితో మాట్లాడుతుందన్న నెపంతో, తన భార్యతో కలిసి ఆమెను దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా శవాన్ని తీసుకెళ్లి దహన సంస్కారాలు కూడా చేసేశారు. అయితే, ఒకే ఒక్క ఫోన్ కాల్ వీరి బండారాన్ని బయటపెట్టింది.
అసలేం జరిగింది? మేరఠ్లోని గోకుల్ ధామ్ కాలనీలో నివసించే కపిల్ శర్మ తన కూతురిపై అనుమానం పెంచుకున్నాడు. కూతురు ఫోన్లో మాట్లాడుతుండటంతో, తన భార్యతో కలిసి ఆమెను గొంతు కోసి చంపేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా హడావుడిగా బ్రజ్ఘాట్ వద్ద అంత్యక్రియలు పూర్తి చేశారు. తాము చేసిన నేరం ఎప్పటికీ బయటకు రాదని వారు భావించారు.
బండారం బయటపడిందిలా.. ఆ బాలిక మేనమామ భూపేంద్ర ఆమెకు ఫోన్ చేయగా, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అనుమానం వచ్చిన మామ, బాలిక తండ్రికి ఫోన్ చేయగా అతను పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీనిపై మరింత అనుమానం పెంచుకున్న మామ, మేరఠ్లోని భావన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పోలీసుల విచారణ: పోలీసులు బాలిక తండ్రి కపిల్ శర్మను, సవతి తల్లి పింకీ శర్మను అదుపులోకి తీసుకుని విచారించగా, వారిద్దరూ భిన్నమైన కథనాలు చెప్పారు. దీనితో పోలీసులు తమదైన శైలిలో కఠినంగా విచారించగా, తమ పాపాన్ని ఒప్పుకున్నారు. మే 26న బాలిక హత్యకు గురైందని, హాపూర్కు తీసుకెళ్లి రహస్యంగా అంత్యక్రియలు చేశారని వారు అంగీకరించారు.
పోలీసుల ప్రకటన: మేరఠ్ ఎస్పీ (రూరల్) అభిజీత్ కుమార్ మాట్లాడుతూ, బాలిక మేనమామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నామని, కఠినంగా విచారించగా వారు నేరాన్ని అంగీకరించారని తెలిపారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించామని పేర్కొన్నారు.
