అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. లెబనాన్లో ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక చర్యల పట్ల ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, నెతన్యాహును కఠినంగా మందలించినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి.
అమెరికన్ న్యూస్ వెబ్సైట్ ‘ఆక్సియోస్’ నివేదిక ప్రకారం, లెబనాన్ దాడుల వల్ల మధ్యప్రాచ్యంలో శాంతి ప్రయత్నాలకు మరియు ఇరాన్తో జరుగుతున్న చర్చలకు విఘాతం కలుగుతుందని ట్రంప్ ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే ఆయన నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడుతూ తన అసహనాన్ని దాచుకోలేదు. ట్రంప్, నెతన్యాహును ‘పిచ్చివాడు’ అని సంబోధించడమే కాకుండా, ఆయనపై ఉన్న అవినీతి కేసుల నుండి బయటపడటానికి తాను ఎంతో సహాయం చేశానని గుర్తు చేశారు.
ట్రంప్ ఏమన్నారంటే? “నువ్వు పూర్తిగా పిచ్చివాడివి. నేను లేకపోతే, నువ్వు ఇప్పటికే జైల్లో ఉండేవాడివి. నీ ప్రాణాలను నేను కాపాడుతున్నాను. ఇప్పుడు అందరూ నిన్ను ద్వేషిస్తున్నారు, అందుకే ఇజ్రాయెల్ను కూడా ద్వేషిస్తున్నారు” అని ట్రంప్ అన్నట్లు ఒక అమెరికన్ అధికారి తెలిపారు. మరొక సందర్భంలో, “నీవు అసలు ఏం చేస్తున్నావు?” అని ట్రంప్ గట్టిగా అరిచినట్లు సమాచారం. ఈ చర్చ జరిగిన సమయంలో, లెబనాన్ చర్యలు ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచుతాయని వాషింగ్టన్ ఆందోళన చెందింది.
ట్రంప్ ఆందోళన ఎందుకు? ఈ దాడులు ఇరాన్తో కాల్పుల విరమణ అవకాశాలను బలహీనపరుస్తాయని, మొత్తం ప్రాంతాన్ని మళ్లీ పెద్ద సంఘర్షణ వైపు నెట్టేస్తాయని ట్రంప్ భావించారు. లెబనాన్ చర్యలను సాకుగా చూపి ఇరాన్ చర్చల నుండి వైదొలుగుతున్నట్లు సంకేతాలు ఇవ్వడంతో, ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇజ్రాయెల్ మరియు హిజ్బుల్లా పక్షాలతో ఆయన మాట్లాడి, దాడులు ఆపాలని కోరారు. అయితే, హిజ్బుల్లా దాడులు ఆపకపోతే ఇజ్రాయెల్ తన సైనిక చర్యను కొనసాగిస్తుందని నెతన్యాహు స్పష్టం చేశారు.
ఇలా ఉండగా, ఇరాన్తో కాల్పుల విరమణ మరియు వ్యూహాత్మక ‘హోర్ముజ్ జలసంధి’ని తిరిగి తెరవడంపై త్వరలోనే ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. సైనిక విజయం కంటే శాంతి ఒప్పందమే గొప్పదని, వచ్చే వారం రోజుల్లో ఈ విషయంలో గణనీయమైన పురోగతి ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
