ముంబైకి చెందిన ఒక డిజిటల్ క్రియేటర్, ఉబర్ డ్రైవర్ తనపై దాడి చేసి, బెదిరించాడని ఆరోపించారు. యాప్లో చూపిన ఛార్జీ చెల్లించిన తర్వాత కూడా, అదనంగా రూ. 40 టోల్ ఛార్జీ నగదు రూపంలో ఇవ్వాలని డ్రైవర్ అడగగా, ఆమె నిరాకరించడంతో ఈ గొడవ మొదలైంది.
మహాలక్ష్మి నుండి నెరుల్కు ఉబర్ రైడ్ బుక్ చేసుకున్న శివాని అనే మహిళ ఈ ఘటనను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. మొదట రూ. 460 అని చూపించిన ఛార్జీ, ప్రయాణం ముగిసేసరికి రూ. 501కి మారింది. ఆ మొత్తాన్ని ఆమె యాప్ ద్వారానే చెల్లించారు. అయితే, టోల్ ఛార్జీల కోసం అదనంగా రూ. 40 నగదు అడగటంతో వివాదం మొదలైంది. టోల్ ఛార్జీలు ఇప్పటికే ఫైనల్ ఫేర్లో కలిసి ఉన్నాయని భావించిన ఆమె చెల్లించడానికి నిరాకరించింది. ఆ తర్వాత డ్రైవర్ దూకుడుగా ప్రవర్తించాడని, కారు దిగనివ్వకుండా అడ్డుకున్నాడని, బయటకు వచ్చిన తర్వాత తనపై చేయి చేసుకున్నాడని ఆమె ఆరోపించారు. ఆత్మరక్షణ కోసం తాను అతడిని నెట్టగా, అతను తనను చెంపదెబ్బ కొట్టి, చేతిని విరిచాడని ఆమె పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో కలకలం: ఈ ఘటనపై ఆమె స్పందిస్తూ, “అది కేవలం గొడవ మాత్రమే కాదు, అతను నన్ను కొట్టాడు. నా చేయి పట్టుకుని విరిచాడు. ఆ తర్వాత ‘మళ్ళీ కొట్టి చూపించమంటావా?’ అని నన్ను భయపెట్టాడు” అని రాసుకొచ్చారు. అప్పటికే ఆఫీసు సహోద్యోగులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని ఆమెకు సహాయం చేశారు. అక్కడున్న స్థానికులు కూడా ఈ గొడవను గమనించి ఆమెకు మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఉబర్ స్పందన: ఈ ఘటనపై ఉబర్ మొదట డ్రైవర్ భద్రతను సాకుగా చూపి ఆ మహిళా ఖాతాను బ్లాక్ చేయగా, డ్రైవర్ ఖాతా యాక్టివ్గా ఉండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో, ఉబర్ ఆ మహిళ ఖాతాను పునరుద్ధరించింది. “మేము ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాము. మా ప్లాట్ఫామ్పై భౌతిక దాడికి తావులేదు. డ్రైవర్పై మా విధానాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకున్నాము” అని ఉబర్ తన ప్రకటనలో పేర్కొంది. అయితే, కంపెనీ తీసుకున్న చర్యలపై ఇంకా స్పష్టత లేదని బాధితురాలు అసహనం వ్యక్తం చేశారు.
ఈ వార్త సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ప్రయాణికుల, ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో ఉబర్ వంటి సంస్థలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
