న్యూఢిల్లీ: ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో సంచలనం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ తన స్వగ్రామమైన బీహార్కు చేరుకున్నారు. ఈ 15 ఏళ్ల సూపర్ స్టార్ తమ ఊరికి వచ్చాడని తెలియగానే, అతడిని చూసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. సమస్తీపూర్లోని తాజ్పూర్లో ఉన్న వైభవ్ స్వగృహం వద్ద అతడికి ఘనస్వాగతం లభించింది.
ప్రస్తుతం ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు వైభవ్ ఇంటి వద్ద గుమిగూడుతున్నారు. దీనివల్ల వైభవ్ బయటకు రావడం కష్టంగా మారింది. అతడు ప్రస్తుతం అతికొద్ది మందిని మాత్రమే కలుస్తున్నాడు. ఇంటి బయట స్థానిక మీడియా మరియు యూట్యూబర్ల సందడి పెరిగిపోయింది. ప్రస్తుతం సూర్యవంశీ కుటుంబం మీడియాకు కాస్త దూరంగా ఉంటోంది.
తల్లిదండ్రుల కృషితోనే ఈ విజయం: వైభవ్ విజయానికి వెనుక అతని తల్లిదండ్రుల అంకితభావం ఉంది. నాలుగు ఏళ్ల ప్రాయంలోనే తండ్రి సంజు పర్యవేక్షణలో వైభవ్ క్రికెట్ శిక్షణ ప్రారంభించాడు. తండ్రి ప్రతిరోజూ ఉదయం 4 గంటలకే వైభవ్ను పట్నాలో శిక్షణ ఇప్పించేందుకు తీసుకెళ్లేవారు. తల్లి ఆర్తి సూర్యవంశీ తెల్లవారుజామునే లేచి అతడి కోసం ఆహారాన్ని సిద్ధం చేసేది. క్రమశిక్షణ, కఠిన శ్రమతో వైభవ్ తనకంటే రెట్టింపు వయసు ఉన్న ఆటగాళ్లను సైతం సునాయాసంగా ఎదుర్కొంటూ భారీ సిక్సర్లు కొట్టడం నేర్చుకున్నాడు.
ఐపీఎల్ 2026లో రికార్డుల మోత: ఐపీఎల్ 2025 వేలంలో 14 ఏళ్ల వయసులోనే రాజస్థాన్ రాయల్స్ జట్టు వైభవ్ను రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సీజన్లోనే శతకంతో సత్తా చాటిన ఈ యువ కెరటం, తాజాగా జరిగిన ఐపీఎల్ 2026లో 16 ఇన్నింగ్స్ల్లో 776 పరుగులు చేసి ‘ఆరెంజ్ క్యాప్’ గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. క్రిస్ గేల్ పేరిట ఉన్న ఒక సీజన్లో అత్యధిక సిక్సర్ల రికార్డును కూడా వైభవ్ బద్దలు కొట్టాడు.
ఇండియా-ఏ జట్టులోకి పిలుపు: అండర్-19 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో అద్భుత శతకంతో భారత్ను విజేతగా నిలిపిన వైభవ్ సూర్యవంశీకి, ఇప్పుడు ‘ఇండియా-ఏ’ జట్టులో చోటు దక్కింది. జూన్ 9 నుండి శ్రీలంకలో జరగనున్న ట్రై-సిరీస్లో అతను ఆడనున్నాడు. వైభవ్ సీనియర్ అంతర్జాతీయ క్రికెట్కు పూర్తిగా సిద్ధమయ్యాడని, అతడికి త్వరలోనే భారత జాతీయ జట్టులో అవకాశం ఇవ్వాలని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
