అమ్రోహా: ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లా ఖేతాపూర్ జహంగీర్పూర్లో జనవరి 11న జగదీష్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అయితే, భర్త చనిపోయినప్పటికీ అతని భార్య బబిత లోలోపల ఎంతో సంతోషంగా ఉండటం కుటుంబ సభ్యులకు, బంధువులకు తీవ్ర అనుమానం కలిగించింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు రంగంలోకి దిగి మృతుడి భార్య బబితను తమదైన శైలిలో విచారించగా.. ఆమె వెల్లడించిన విస్తుపోయే నిజాలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఏడు అడుగులు వేసి, జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసిన భర్తను.. తన ప్రియులతో కలిసి ఆమె ఎలా అంతమొందించిందో విచారణలో అంగీకరించింది. ఈ కేసును ఛేదించిన పోలీసులు భార్యతో పాటు మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే..?
జనవరి 11న అమ్రోహా రోడ్డులోని కరన్పూర్ మాఫీ గ్రామం సమీపంలో రోడ్డు పక్కన ఒక 40 ఏళ్ల వ్యక్తి మృతదేహం పడి ఉండటం కలకలం రేపింది. మృతుడిని ఖేతాపూర్ జహంగీర్పూర్ నివాసి జగదీష్గా పోలీసులు గుర్తించి, పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు జరిపిన లోతైన దర్యాప్తులో.. జగదీష్ భార్య బబితకు రిహాన్, షానవాజ్ అనే ఇద్దరు యువకులతో అక్రమ సంబంధం ఉన్నట్లు తేలింది. భార్య వ్యవహారం భర్త జగదీష్కు తెలియడంతో ఆయన దీనిని తీవ్రంగా వ్యతిరేకించాడు. ప్రతిరోజూ ఇంట్లో గొడవలు జరగడంతో, భర్తను శాశ్వతంగా వదిలించుకోవాలని బబిత ప్లాన్ వేసింది.
మందుల సాకుతో పంపి.. దారిలోనే హతం!
జనవరి 11న తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో బబిత తన ప్రియులు రిహాన్, షానవాజ్లను రహస్యంగా ఇంటికి పిలిపించింది. ఆపై మందులు తీసుకురావాలనే సాకుతో భర్త జగదీష్ను వారితో పాటు బయటకు పంపించింది. నమ్మకంగా భార్య మాట విని బయటకు వెళ్లిన జగదీష్ను నిందితులిద్దరూ కలిసి దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి పరారయ్యారు.
ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులు రిహాన్ (తండ్రి ఉస్మాన్), షానవాజ్ (తండ్రి సలామత్ ఉల్లా)లతో పాటు భార్య బబితను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి హత్యకు ఉపయోగించిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అమ్రోహా ఏఎస్పీ రాజీవ్ కుమార్ ప్రకటన:
“జనవరి 11న హసన్పూర్ పరిధిలో ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడిని జగదీష్గా గుర్తించాం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. జగదీష్ భార్యకు రిహాన్తో అక్రమ సంబంధం ఉన్నట్లు తేలింది. రిహాన్, అతని స్నేహితుడు షానవాజ్ కలిసి ఈ హత్యకు ఒడిగట్టారు. ఈ దారుణానికి సహకరించిన భార్య బబితతో సహా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించాం.”

Leave a Reply