పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ముక్కలవుతోంది. పార్టీలో తిరుగుబాటు ఇప్పుడు పూర్తిగా అదుపు తప్పింది. ఈ క్రమంలో ఒక సంచలన వార్త బయటకు వచ్చింది. టీఎంసీకి చెందిన 20 మంది అసమ్మతి ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ పంపగా, అందులో సయానీ ఘోష్ పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
మీడియా కథనాల ప్రకారం.. స్పీకర్ ఓం బిర్లాకు రాసిన లేఖపై సయానీ ఘోష్ కూడా సంతకం చేశారు. ఇది మమతా బెనర్జీకి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఘోష్ ఒక నటి, గాయని మరియు టీఎంసీ ఎంపీ. ప్రస్తుతం ఆమె జాదవ్పూర్ లోక్సభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
‘కాబా-మదీనా’ పాటతో గుర్తింపు: ‘జూనియర్ మమత’గా పిలవబడే సయానీ ఘోష్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో బాగా ప్రాచుర్యం పొందారు. ‘హృదయ్ మా ఛే కాబా ఔర్ నయనే మదీనా’ (గుండెలో కాబా, కళ్లలో మదీనా) అనే జానపద గీతాన్ని పాడటం ద్వారా ఆమె బీజేపీ లక్ష్యంగా మారారు. ఈ పాట మతపరంగా ఉందని బీజేపీ నేతలు అప్పట్లో ఆమెను తీవ్రంగా విమర్శించారు.
రాఘవ్ చద్దాపై వ్యాఖ్యలు – వివాదం: ఆమ్ ఆద్మీ పార్టీని వదిలి బీజేపీలో చేరిన రాఘవ్ చద్దాను ఉద్దేశించి సయానీ ఘోష్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. “మీలో రాఘవ్ చద్దాలో ఉన్నంత ఎనర్జీ, స్పార్క్ ఉన్నాయని కొందరు అంటున్నారు” అని ఒక జర్నలిస్ట్ ప్రశ్నించగా.. “నా పేరులో చద్దా లేదు. చద్దా ‘చడ్డీ’గా మారవచ్చు కానీ, ఘోష్ ఎప్పుడూ ఘోష్గానే ఉంటుంది” అని ఆమె సమాధానమిచ్చారు. ఈ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ అప్పట్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
సయానీ ఘోష్ రాజకీయ ప్రస్థానం: సినిమా రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చిన సయానీ ఘోష్ బెంగాలీ చిత్రసీమలో ప్రముఖ నటి. 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె టీఎంసీలో చేరారు. మమతా బెనర్జీ ఆమెకు ఆసన్సోల్ సీటు ఇచ్చినా, అక్కడ ఆమె ఓడిపోయారు.
అంతేకాకుండా, గతంలో ఆమె జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. త్రిపుర స్థానిక ఎన్నికల సమయంలో బీజేపీ సభ వద్ద ‘ఖేలా హోబే’ అని నినాదాలు చేసినందుకు అగర్తలా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. 2023లో టీఎంసీ యువజన విభాగం అధ్యక్షురాలు అయిన తర్వాత, రిక్రూట్మెంట్ స్కామ్ దర్యాప్తులో భాగంగా ఆమెను 10 గంటల పాటు విచారించారు. 2024లో జాదవ్పూర్ నుండి ఎంపీగా గెలిచిన ఆమె, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ స్టార్ క్యాంపెయినర్గా కూడా వ్యవహరించారు.
స్పీకర్కు 20 మంది టీఎంసీ ఎంపీల లేఖ: లోక్సభలో టీఎంసీకి 28 మంది, రాజ్యసభలో 13 మంది ఎంపీలు ఉన్నారు. టీఎంసీ ఎంపీ కాకోలీ ఘోష్ దస్తిదార్ వాదన ప్రకారం.. దాదాపు 20 మంది ఎంపీలు ఎన్డీఏ (NDA) కు మద్దతు ఇవ్వాలని భావిస్తున్నారు. పార్లమెంటులో తమకు ప్రత్యేక కేటాయింపులు చేయాలని కోరుతూ వీరు స్పీకర్కు లేఖ రాశారు. ఇందులో సయానీ ఘోష్ పేరు ఉండటం గమనార్హం.

Leave a Reply