ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ జిల్లాలో పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షల సమయంలో ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగుచూసింది. పరీక్షా కేంద్రం వెలుపల 24 ఏళ్ల యువకుడిని కాల్చి చంపారు.
మృతుడిని శివకుమార్గా గుర్తించారు. అతను తన భార్య ఆకాంక్షను గోచర్ ఇంటర్ కాలేజీలో జరుగుతున్న పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షకు తీసుకువచ్చాడు.
ప్రజల్లో పెరిగిన భయాందోళనలు: ఆకాంక్ష పరీక్ష రాయడానికి లోపలికి వెళ్లగా, శివకుమార్ బయట ఆమె కోసం వేచి చూస్తున్నాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఆకాంక్ష తమ్ముడు మంజీత్, ఒక్కసారిగా శివకుమార్పై కాల్పులు జరిపాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ కాల్పులతో పరీక్షా కేంద్రం వద్ద ఉన్న అభ్యర్థులు, సాధారణ ప్రజలు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
శివకుమార్ బుల్లెట్ గాయాలతో రక్తపు మడుగులో కింద పడిపోవడంతో అక్కడి వారు మరింత భయాందోళనకు గురయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
చికిత్స పొందుతూ మృతి: సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన శివకుమార్ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది, శివకుమార్ చికిత్స పొందుతూ మరణించాడు. రాంపూర్ మణిహారన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ హత్య స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమ వివాహమే కారణమా?: ప్రేమ వివాహం కారణంగానే ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులకు ఆకాంక్ష ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం.. కుటుంబ సభ్యుల వ్యతిరేకతను పక్కనపెట్టి నాలుగు నెలల క్రితం తాను శివకుమార్ను ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలిపింది. పెళ్లి తర్వాత కూడా కుటుంబ సభ్యులు తమపై పగతో ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
తన తమ్ముడు మంజీత్ ఈ వివాహాన్ని అస్సలు అంగీకరించలేక పోయాడని, ఆ కోపంతోనే తన భర్తను కాల్చి చంపాడని ఆమె ఆరోపించింది. శివకుమార్ సోదరుడు శివం కుమార్ కూడా పెళ్లి నాటి నుండి రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply