యాటిల్: కృత్రిమ మేధస్సు (Artificial Intelligence – AI) సాంకేతికత సాధిస్తున్న అపారమైన వృద్ధి, అదే సమయంలో అది మానవాళికి కలిగించబోయే ప్రమాదాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో, ప్రముఖ ‘క్లాడ్ ఏఐ’ (Claude AI) టూల్ను రూపొందించిన ‘ఆంత్రోపిక్’ (Anthropic) సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ (CEO) డారియో అమోడీ (Dario Amodei) సంచలన వ్యాఖ్యలు చేశారు. AI సాంకేతికత మానవ నియంత్రణను దాటి వెళ్ళిపోతుందేమోననే భయం తనను వెంటాడుతోందని ఆయన బహిరంగంగానే ఒప్పుకున్నారు.
ప్రస్తుత కాలంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం ఏదైనా ఉందంటే అది AI మాత్రమే. కనురెప్ప మూసి తెరిచేలోపు ఈ రంగంలో ఊహించని మార్పులు, వృద్ధీ చోటుచేసుకుంటున్నాయి. అయితే, ఇంత వేగవంతమైన వృద్ధి ఎంత ఉందో, అందులో అంతే ప్రమాదం దాగి ఉందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆంత్రోపిక్ సీఈఓ ఆందోళన: బ్లూమ్బెర్గ్ (Bloomberg) డాక్యుమెంటరీలో మాట్లాడిన డారియో అమోడీ AI వృద్ధికి సంబంధించిన తన ఆందోళనలను పంచుకున్నారు. “AIని సురక్షితంగా ఉంచడానికి మనం చేయగలిగినదంతా చేస్తున్నామా? ఖచ్చితంగా, సాధ్యమైనంతవరకు ప్రయత్నిస్తున్నాం” అని ఆయన పేర్కొన్నారు.
అయినప్పటికీ, ప్రపంచవ్యాప్త AI పరిశోధనా సంస్థలు తమ సాంకేతికత అభివృద్ధి వేగాన్ని తగ్గించాలని లేదా తాత్కాలికంగా నిలిపివేయాలని ఆయన అభ్యర్థించారు. AI టూల్స్ సమాజంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో పూర్తిగా అర్థం చేసుకునే వరకు ఈ తరహా తొందరపాటు వేగం అవసరం లేదన్నది ఆయన అభిప్రాయం.
ఉద్యోగాల కోతపై భయాలు: మరోవైపు, AI సాంకేతికత వృద్ధి వల్ల తాము లేదా తమ కుటుంబ సభ్యులు ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని 50 శాతానికి పైగా అమెరికన్లు భయపడుతున్నట్లు ‘రాయిటర్స్’ (Reuters) సర్వే స్పష్టం చేసింది. వయస్సు, లింగం, విద్యార్హతలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజల్లోనూ ఈ ఆందోళన వ్యక్తమవుతోంది.
AI సంస్థల మధ్య కూడా ఈ భద్రతా నిబంధనలపై విభేదాలు ఉన్నాయి. చాట్ జిపిటి (ChatGPT)ని సృష్టించిన ఓపెన్ ఏఐ (OpenAI) సంస్థలోనే పలువురు పరిశోధకులు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. లాభాల కంటే భద్రతా ఫీచర్లకే ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పలువురు సీనియర్ శాస్త్రవేత్తలు, సహ వ్యవస్థాపకులు ఆ సంస్థ నుండి బయటకు వచ్చేశారు. భద్రతా చర్యల లోపాలపై ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్ ఇటీవల క్షమాపణలు కూడా చెప్పారు. భవిష్యత్తులో సురక్షితమైన AIని రూపొందించడంపైనే దృష్టి పెడతామని ప్రకటించారు.
AI నిషేధానికి అవకాశం ఉందా? భవిష్యత్తులో ఏదో ఒక దశలో AI సాంకేతికతపై నిషేధం విధించే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు, “అది సాధ్యమయ్యే విషయమే” అని అమోడీ సమాధానమిచ్చారు. AI సాంకేతికత వల్ల సమాజానికి ఏదైనా పెద్ద ప్రమాదం లేదా విపత్తు సంభవిస్తే, దానిని నిషేధించడం పూర్తిగా సమర్థించదగినదే అని ఆయన స్పష్టం చేశారు.
AI వ్యవస్థలను ప్రజల్లోకి విడుదల చేయడానికి ముందే, ప్రభుత్వం తరపున కఠినమైన భద్రతా పరీక్షలను తప్పనిసరి చేయాలని అమోడీ నొక్కి చెప్పారు. AI సంస్థలు పారదర్శకతతో వ్యవహరించడంతో పాటు ప్రభుత్వ నియంత్రణలు కూడా ఉండాలని ఆయన వాదించారు. “AI వ్యవస్థలను ప్రజల వినియోగానికి తీసుకురావడానికి ముందు, థర్డ్-పార్టీ స్వతంత్ర సంస్థల ద్వారా పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి చేయాలి” అని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వాలకు నియంత్రణ అధికారం ఉండాలి: సైబర్ భద్రతకు ముప్పు కలిగించే లేదా మానవ నియంత్రణను దాటిపోయే ప్రమాదం ఉన్న AI వ్యవస్థలను బ్లాక్ చేసే (ముసివేసే) అధికారం ప్రభుత్వాలకు ఉండాలని అమోడీ అభిప్రాయపడ్డారు. ఔషధాలు (ఫార్మా), విమానయాన రంగాలలో వలెనే.. AI టూల్స్ విడుదలయ్యే ముందు కూడా కఠినమైన సెక్యూరిటీ ఆడిటింగ్ అవసరమని పేర్కొన్నారు.
AI సాంకేతికత అభివృద్ధి చెందుతున్న వేగంతో పోలిస్తే, ప్రభుత్వాలు ఆ స్థాయి వేగంతో చట్టాలను లేదా విధానాలను రూపొందించలేకపోతున్నాయని అమోడీ అన్నారు. సాంకేతిక వృద్ధికి, దానిని నియంత్రించే చట్టాలకు మధ్య ఉన్న ఈ “వ్యత్యాసం” చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. AI సాంకేతికత దేశ భద్రతను, ఆర్థిక వ్యవస్థను కేవలం కొన్ని నెలల్లోనే మార్చేసే శక్తి కలిగి ఉన్నందున, అదనపు రక్షణ చర్యలు అత్యంత అవసరమని ఆయన ముగించారు.

Leave a Reply