2027 పురుషుల వన్డే ప్రపంచకప్ షెడ్యూల్: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2027 దక్షిణాఫ్రికా, జింబాబ్వే మరియు నమీబియా దేశాల సంయుక్త ఆతిథ్యంలో జరగనుంది. వన్డే క్రికెట్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ మెగా టోర్నమెంట్కు సంబంధించి ఒక కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.
మీడియా కథనాల ప్రకారం.. ఈ మెగా ఈవెంట్ 2027 అక్టోబర్ 4 నుండి ప్రారంభమై 2027 నవంబర్ 21 వరకు కొనసాగనుంది. దాదాపు ఒకటిన్నర నెలల పాటు జరిగే ఈ టోర్నమెంట్లో మొత్తం 54 మ్యాచ్లు నిర్వహించనున్నారు. ప్రపంచంలోని టాప్-14 జట్లు ఈ ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకోవడానికి హోరాహోరీగా తలపడనున్నాయి.
వన్డే వరల్డ్ కప్ 2027 షెడ్యూల్ ఖరారు! 2027 ప్రపంచకప్ గత 2023 ఎడిషన్ కంటే చాలా భిన్నంగా ఉండబోతోంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఈసారి పాత 2003 నాటి వరల్డ్ కప్ ఫార్మాట్ను తిరిగి తీసుకువస్తోంది. దీని ప్రకారం.. మొత్తం 14 జట్లను 7-7 చొప్పున రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఆ తర్వాత ప్రతి గ్రూప్ నుండి టాప్-3 స్థానాల్లో నిలిచిన జట్లు ‘సూపర్-సిక్స్’ (Super Six) రౌండ్లోకి ప్రవేశిస్తాయి. అనంతరం సూపర్-సిక్స్ దశలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు చేరుకుంటాయి. ఆపై నవంబర్ 21న ప్రతిష్టాత్మకమైన ఫైనల్ పోరు జరుగుతుంది.
ఏ దేశంలో ఎన్ని మ్యాచ్లు జరుగుతాయి? ఈ టోర్నమెంట్ మూడు దేశాలలో నిర్వహించబడుతుండగా, ఇందులో దక్షిణాఫ్రికా ప్రధాన ఆతిథ్య దేశంగా వ్యవహరిస్తుంది. నివేదికల ప్రకారం.. దక్షిణాఫ్రికాలోని 8 స్టేడియాలలో టోర్నమెంట్కు సంబంధించిన మెజారిటీ మ్యాచ్లతో పాటు నాకౌట్ (సెమీఫైనల్, ఫైనల్) మ్యాచ్లు కూడా జరుగుతాయి. ఇందులో జోహన్నెస్బర్గ్ లోని వాండరర్స్, కేప్టౌన్ లోని న్యూలాండ్స్, డర్బన్ లోని కింగ్స్మీడ్ స్టేడియాలు ఉన్నాయి. మరోవైపు, జింబాబ్వేలోని హరారే, బులవాయో అనే రెండు నగరాల్లో మ్యాచ్లు నిర్వహించనున్నారు. ఇది కాకుండా, నమీబియా దేశం మొదటిసారిగా ఒక పెద్ద ఐసీసీ ఈవెంట్కు ఆతిథ్యం ఇస్తుండటంతో అక్కడ కూడా రెండు మైదానాల్లో మ్యాచ్లు జరగనున్నాయి.
ఏ 14 జట్లకు అవకాశం లభిస్తుంది? వన్డే ప్రపంచకప్ 2027 కోసం ఆతిథ్య దేశాలైన దక్షిణాఫ్రికా, జింబాబ్వే జట్లు నేరుగా (డైరెక్ట్ ఎంట్రీ) క్వాలిఫై అయ్యాయి. ఇవి కాకుండా ఐసీసీ ర్యాంకింగ్స్లో టాప్-8 స్థానాల్లో ఉన్న జట్లు నేరుగా అర్హత సాధిస్తాయి. అయితే నమీబియా ఆతిథ్య దేశమే అయినప్పటికీ.. ప్రపంచకప్లో తన స్థానాన్ని ఖరారు చేసుకోవడానికి క్వాలిఫైయర్ రౌండ్ ఆడాల్సి ఉంటుంది. మిగిలిన 4 స్థానాల కోసం క్వాలిఫైయర్ టోర్నమెంట్లో జట్ల మధ్య గట్టి పోటీ ఉండబోతోంది. ఇదిలా ఉండగా, గత 2023 ఫైనల్ ఓటమిని మర్చిపోయి.. ఈ కొత్త ఫార్మాట్లో సరికొత్త చరిత్ర సృష్టించాలని భారత జట్టు (టీమ్ ఇండియా) భావిస్తోంది.

Leave a Reply