వాషింగ్టన్: అమెరికా తన శత్రువులను ఏ దేశంలోనైనా సరే చొరబడి మరీ మట్టుబెట్టగలదని గతంలోనే ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ను చంపి నిరూపించింది. ఇప్పుడు మరోసారి అదే తరహాలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెనిజులాలో ఉన్న అమెరికా ప్రధాన శత్రువును పూర్తిగా ఖతం చేశారు.
వెనిజులాకు చెందిన అత్యంత అపఖ్యాతి పాలైన నేరపూరిత ముఠా ‘ట్రైన్ డి అరాగువా’ (Tren de Aragua) అధినేత నినో గ్యురెరోను అమెరికా సైన్యం విజయవంతంగా హతమార్చింది. తన ప్రత్యక్ష ఆదేశాల మేరకే ‘యూఎస్ సదరన్ కమాండ్’ ఈ ఘోరమైన సైనిక దాడిని నిర్వహించిందని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్కు సంబంధించిన ఒక వీడియోను ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ‘ట్రూత్ సోషల్’ (Truth Social) లో షేర్ చేశారు. ఆ వీడియోలో ఒక భవనంపై శక్తివంతమైన బాంబు పేలుడు సంభవించడం, కొన్ని సెకన్లలోనే ఆ ప్రాంతమంతా పొగ, శిథిలాలతో నిండిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది.
ట్రంప్ తన పోస్ట్లో ఇలా రాశారు.. “నా మార్గదర్శకత్వంలో, ప్రపంచంలోని అత్యంత క్రూరమైన ఉగ్రవాద ముఠాలలో ఒకటైన ట్రైన్ డి అరాగువా కుఖ్యాతి చెందిన నాయకుడు నినో గ్యురెరోను అంతమొందించడానికి యూఎస్ సదరన్ కమాండ్ వేగవంతమైన, ఘోరమైన దాడిని చేసింది.” ఈ చర్యను ట్రంప్ తన ఎన్నికల వాగ్దానంతో ముడిపెట్టారు. అమెరికా పౌరులను పొట్టనబెట్టుకుంటున్న నేరగాళ్లను కఠినంగా శిక్షిస్తానని తాను ఇచ్చిన మాటను ఇప్పుడు నెరవేరుస్తున్నట్లు చెప్పారు. “ఈ హంతకులను, డ్రగ్స్ మాఫియా లార్డ్స్ను ప్రపంచంలో ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని, నరకం నరకంలోకి తొక్కిపారేస్తాం” అని ట్రంప్ హెచ్చరించారు.
జో బైడెన్పై విమర్శల బాణాలు:
ట్రంప్ తన ప్రకటనలో మాజీ అధ్యక్షుడు జో బైడెన్పై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బైడెన్ పరిపాలనలో అమెరికా దక్షిణ సరిహద్దులను (Southern Border) పూర్తిగా తెరిచి ఉంచడం వల్లే లక్షలాది మంది అక్రమ నేరగాళ్లు అమెరికాలోకి ప్రవేశించారని ఆరోపించారు. ఈ ‘ట్రైన్ డి అరాగువా’ ముఠా సభ్యులు అమెరికాలో చొరబడి హత్యలు, హింస మరియు ఇతర తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నారని ట్రంప్ వాదించారు.
ఏ హత్యలను ప్రస్తావించిన ట్రంప్?
తన ప్రకటనలో ట్రంప్.. గతంలో అమెరికాను కుదిపేసిన 12 ఏళ్ల జోసెలిన్ నుంగారే, 22 ఏళ్ల లేకెన్ రైలీ హత్యలను గుర్తుచేశారు. నివేదికల ప్రకారం.. 2024 లో హ్యూస్టన్కు చెందిన 12 ఏళ్ల చిన్నారి జోసెలిన్ నుంగారే హత్య కేసులో వెనిజులా నుండి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. అలాగే జార్జియాకు చెందిన 22 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని లేకెన్ రైలీ హత్య కేసులో కూడా అక్రమ చొరబాటుదారుడిపైనే ఆరోపణలు వచ్చాయి.
వెనిజులా మిత్రదేశాలతో కలిసి ఆపరేషన్:
వెనిజులాలోని అమెరికా మిత్రపక్షాల (Allies) సహకారంతోనే ఈ మిలిటరీ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసినట్లు ట్రంప్ వెల్లడించారు. ‘ట్రైన్ డి అరాగువా’ ఉగ్రవాదులకు ఇకపై వెనిజులాలో గానీ, ప్రపంచంలో మరెక్కడా గానీ రక్షణ లేదని స్పష్టం చేశారు. ట్రంప్ ఇప్పటికే ఈ ముఠాను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు. తన యంత్రాంగం ఇప్పటికే వేలాది మంది నేరగాళ్లను దేశం నుండి తరిమికొట్టిందని, డ్రగ్ కార్టెల్స్పై పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించిందని ట్రంప్ స్పష్టం చేశారు.

Leave a Reply