నాందేడ్: మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన ఆంజల్ మామిత్వార్ అనే యువతి, తన ప్రియుడు సక్షమ్ దాదే మరణించిన తర్వాత అతని మృతదేహంతో వివాహం చేసుకుని, ఆ తర్వాత అత్తగారి ఇంట్లోనే నివసిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే, ఇటీవల ఆంజల్ రకరకాల సాకులు చెప్పి ఇంటి నుండి పారిపోయిందని ఆమె అత్తగారు సంగీతా దాదే ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీయడంతో, ఆంజల్ మౌనాన్ని వీడి మీడియా ముందుకు వచ్చి అసలు నిజాలను బయటపెట్టింది.
తన ప్రియుడి తమ్ముడు (మరిది) తన పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించాడని, దీనిపై ఇంట్లో ఉన్నవారికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ నమ్మలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. వేధింపులు భరించలేక తాను పోలీసుల రక్షణతో ఇంటి నుండి బయటకు వచ్చానని, ప్రస్తుతం తన తండ్రి ఇంట్లో క్షేమంగా ఉన్నానని ఆంజల్ వెల్లడించింది.
తనపై అత్తగారు చేసిన ఆరోపణలను ఆంజల్ పూర్తిగా తిరస్కరించింది. తన అత్తగారి కుటుంబ సభ్యుల తప్పుడు ప్రవర్తన వల్లే తాను ఆ ఇంటిని వదిలిపెట్టాల్సి వచ్చిందని వివరించింది. ఇక సక్షమ్ తండ్రి మరణం గురించి మాట్లాడుతూ.. కొడుకు వియోగం వల్ల ఆయన చనిపోలేదని, అతిగా మద్యం సేవించడం వల్ల క్లోమం (Pancreas) దెబ్బతిని అనారోగ్యంతో మరణించారని క్లారిటీ ఇచ్చింది.
తాను ఎవరినీ మోసం చేయలేదని, పోలీసులకు పూర్తి సమాచారం అందించి వారి సమక్షంలోనే ఇంటి నుండి బయటకు వచ్చానని చెప్పిన ఆంజల్.. తనపై అసత్య ప్రచారాలు చేయడం ఆపాలని అత్తగారిని కోరింది.

Leave a Reply