పెరంబలూరు: తమిళనాడులోని పెరంబలూరు జిల్లా వేప్పూర్ గ్రామానికి చెందిన గుణశేఖరన్ భార్య నిశాంతిని. వీరికి కృతిష (9) అనే కుమార్తె ఉంది.
భర్త సంపాదన కుటుంబ పోషణకు సరిపోవడం లేదనే కారణంతో గత ఐదేళ్ల క్రితం భర్తతో గొడవపడి విడిపోయిన నిశాంతిని.. తన కుమార్తెతో కలిసి కారై సమతువపురంలోని తన పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలో పెరంబలూరులోని ఒక కన్స్ట్రక్షన్ లేబర్ యూనియన్ (భవన నిర్మాణ కార్మిక సంఘం) ఆఫీసులో పని చేస్తున్న సమయంలో, అక్కడ నిశాంతినికి మణికంఠన్ (30) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, అది కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. కొన్నాళ్లకు వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో జీవించాలని (సహజీవనం) నిర్ణయించుకున్నారు. అయితే, తాము కలిసి ఉండటానికి తన 9 ఏళ్ల కుమార్తె కృతిష అడ్డంగా ఉందని నిశాంతిని భావించింది.
నిద్రపోతున్నట్లు నాటకం:
ఈ క్రమంలో నిన్న మధ్యాహ్నం స్కూల్ నుండి ఇంటికి వచ్చిన చిన్నారి కృతిషను.. కన్నతల్లి నిశాంతిని తాడుతో మెడకు ఉరివేసి అత్యంత కొరడూరంగా హత్య చేసింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు శవాన్ని మంచంపై పడుకోబెట్టి, నిద్రపోతున్నట్లుగా చిత్రీకరించింది. కాసేపటికి కూతురు స్పృహ తప్పి పడిపోయిందంటూ నమ్మబలికి, ఇరుగుపొరుగు వారి సహాయంతో కారై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. అక్కడ చిన్నారిని పరీక్షించిన వైద్యులు, ఆమె అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. అయితే, బాలిక మెడపై తాడుతో బిగించిన గుర్తులు ఉండటాన్ని గమనించిన డాక్టర్లు వెంటనే పడాలూర్ పోలీసులకు సమాచారం అందించారు.
నిశాంతిని మేనమామ లోకనాథన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిశాంతినిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల శైలి విచారణలో.. తన అక్రమ సంబంధం కోసమే కన్నకూతురిని తానే స్వయంగా హత్య చేసినట్లు ఆమె ఒప్పుకుంది. ఈ దారుణ ఘటన స్థానిక ప్రాంతంలో తీవ్ర సంచలనం మరియు కలకలం రేపింది.

Leave a Reply