ముజఫర్పూర్: బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో మానవత్వాన్ని పూర్తిగా మంటగలిపే ఒక ఘోర ఉదంతం వెలుగుచూసింది. ప్రమాదంలో పడి ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న దంపతులను కాపాడాల్సింది పోయి.. రోడ్డుపై పడిపోయిన మామిడి పండ్లను దొంగిలించడానికి జనం పోటీ పడిన తీరు స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
మధుబని జిల్లాకు చెందిన అజయ్ పాశ్వాన్ (40) అనే మామిడి పండ్ల వ్యాపారి, తన భార్య చంద్రా దేవితో కలిసి పశ్చిమ బెంగాల్ నుండి మామిడి పండ్ల లోడ్తో కూడిన పికప్ వాహనంలో ముజఫర్పూర్ వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో హనుమాన్ నగర్ చౌక్ సమీపంలోని జాతీయ రహదారి (National Highway) పై వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి రోడ్డుపై తలకిందులుగా పల్టీ కొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో వాహనం పూర్తిగా ధ్వంసమవడంతో.. వ్యాపారి, అతని భార్య ఇద్దరూ క్యాబిన్ శిథిలాల మధ్య ఇరుక్కుపోయి రక్తపు మడుగులో ప్రాణాల కోసం పోరాడారు.
ప్రాణాలు పోతున్నా.. పండ్ల కోసమే ఆరాటం:
వాహనం పల్టీ కొట్టడంతో టన్నుల కొద్దీ మామిడి పండ్లు రోడ్డు పొడవునా చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదం జరగడం చూసి అక్కడికి పరుగున వచ్చిన స్థానిక ప్రజలు.. రక్తపు మడుగులో నరకయాతన అనుభవిస్తూ, ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న ఆ దంపతులను రక్షించడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు. దానికి బదులుగా రోడ్డుపై పడి ఉన్న మామిడి పండ్లను ఎగబడి దోచుకోవడంలో తీవ్రంగా నిమగ్నమయ్యారు. క్షతగాత్రులైన దంపతులు నొప్పితో అరుస్తున్నప్పటికీ.. అక్కడ చేరిన అడవాళ్లు, మగాళ్లు సంచుల్లో మామిడి పండ్లను నింపుకుని పారిపోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, తీవ్రంగా గాయపడిన దంపతులను అతికష్టం మీద శిథిలాల నుండి వెలికితీసి ఆసుపత్రికి తరలించారు. అయితే దురదృష్టవశాత్తూ, తీవ్ర రక్తస్రావం కావడం వల్ల చికిత్స ఫలించక వ్యాపారి అజయ్ పాశ్వాన్ కన్నుమూశాడు. అతని భార్య చంద్రా దేవి పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉంది. మానవత్వాన్ని శంకించేలా ఉన్న ఈ మొత్తం ఉదంతాన్ని అక్కడున్న కొందరు మొబైల్లో రికార్డ్ చేయగా, ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి నెటిజన్లలో తీవ్ర ఆగ్రహాన్ని, విచారాన్ని కలిగిస్తోంది.

Leave a Reply