ఇల్లంతా సీసీటీవీ కెమెరాలు..! “పక్కింటి మహిళతో మాట్లాడటం ఒక నేరమా?”.. నవవధువును చితకబాదిన భర్త.. పెళ్లయిన ఒకటిన్నర నెలలకే ఘోరం!

మహారాష్ట్ర: మహారాష్ట్రలోని అంబర్‌నాథ్ ప్రాంతంలో.. పెళ్లయిన కేవలం ఒకటిన్నర నెలలకే వరకట్న వేధింపులు, అత్తగారింటి చిత్రహింసలు భరించలేక విశాఖ తిలేకర్ (26) అనే నవవధువు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూసింది.

ఈ ఘోర ఉదంతంపై పోలీసులు కేసు నమోదు చేసి, మృతురాలి భర్త అయిన డాక్టర్ నితిన్ తిలేకర్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

వీరి వివాహం ఇటీవలే ఏప్రిల్ 30, 2026న ఎంతో ఘనంగా జరిగింది. పెళ్లికి ముందు అంతా సజావుగానే ఉన్నప్పటికీ.. వివాహం ముగిసిన వెంటనే తాము ఆశించిన స్థాయిలో కట్నకానుకలు, లాంఛనాలు రాలేదంటూ భర్త మరియు అత్తగారింటి వారు విశాఖను వేధించడం ప్రారంభించారు. పుట్టింటి నుండి అదనంగా డబ్బు, నగలు తీసుకురావాలంటూ ఆమెను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా హింసించసాగారు.

భర్త నితిన్ తిలేకర్ ఒక అడుగు ముందుకు వేసి.. తన భార్య రోజంతా ఇంట్లో ఏం చేస్తోంది, ఎవరితో మాట్లాడుతోంది అని నిరంతరం గమనించడానికి ఇల్లంతా లోపల, బయట CCTV కెమెరాలను ఏర్పాటు చేశాడు. ఆ విధంగా ఆమె కనీస వ్యక్తిగత స్వేచ్ఛను పూర్తిగా హరించాడు. అంతేకాకుండా, విశాఖ తన సొంత తల్లిదండ్రులతో, కుటుంబ సభ్యులతో మాట్లాడటంపై కూడా ఆంక్షలు విధించాడు. రెండు రోజుల క్రితం, కేవలం పక్కింటి మహిళతో కాసేపు మాట్లాడిందనే నెపంతో విశాఖను ఆమె భర్త అత్యంత దారుణంగా చితకబాదాడు.

ఆత్మహత్య చేసుకోవడానికి కొద్దిసేపటి ముందు, తనపై జరుగుతున్న ఈ ఘోర చిత్రహింసల గురించి విశాఖ ఫోన్ ద్వారా తన తల్లికి చెప్పి కన్నీరు పెట్టుకుంది. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆమెను తమ ఇంటికి తీసుకువెళ్లడానికి సిద్ధమవుతున్న సమయంలోనే.. విశాఖ మనస్తాపంతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు వరకట్న వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, డాక్టర్ నితిన్ తిలేకర్‌ను అదుపులోకి తీసుకున్నారు.


Posted

in

by

Tags: