ఈరోజు ₹1 లక్షల కోట్ల వేలం నిర్వహించనున్న రిజర్వ్ బ్యాంక్.. ఇప్పటికే ₹1.89 లక్షల కోట్లు సరఫరా.. అసలు ఈ డబ్బు అవసరం ఎక్కడ పడుతుంది?

న్యూఢిల్లీ: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) శుక్రవారం ₹1 లక్షల కోట్ల విలువైన వేలం నిర్వహించనుంది. ఈ నిధులను దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలోకి సరఫరా చేయనున్నారు. దీనికంటే ముందే ఆర్‌బీఐ ఇప్పటికే వివిధ విడతల్లో ₹1.89 లక్షల కోట్ల రూపాయలను బ్యాంకింగ్ వ్యవస్థలోకి చేర్చింది.

అసలు ఇంత భారీ మొత్తంలో డబ్బు ఎందుకు అవసరమవుతుంది? ఈ నిధులను బ్యాంకులు ఏం చేస్తాయి? ఆర్‌బీఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఈరోజు ఉదయం 9:30 గంటల నుండి 10:00 గంటల మధ్య ఈ వేలం ప్రక్రియ నిర్వహించబడుతుంది. దీని ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న నగదు కొరతను తీర్చి, లిక్విడిటీని (నగదు లభ్యతను) పెంచడం జరుగుతుంది.

ఆర్‌బీఐ ఈరోజు నుండి మూడు రోజుల కాలపరిమితి గల ‘వేరియబుల్ రేట్ రెపో’ (VRR – Variable Repo Rate) వేలాన్ని నిర్వహించనుంది. ఈ వేలం జూన్ 19న ఉదయం 9:30 నుండి 10:00 గంటల మధ్య జరుగుతుంది. అయితే, ఈ వ్యవస్థ ద్వారా బ్యాంకింగ్‌లోకి సరఫరా చేసే నగదును తిరిగి జూన్ 22న వెనక్కి తీసుకుంటారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు మరియు మారుతున్న నగదు లభ్యత స్థితిగతులను సమీక్షించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. వీఆర్‌ఆర్ (VRR) విధానం ప్రకారం.. ఆర్‌బీఐ బ్యాంకులకు వేర్వేరు వడ్డీ రేట్లపై బిడ్డింగ్ ద్వారా నిధులను రుణాలుగా అందిస్తుంది.

బ్యాంకుల్లో డబ్బులు వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?

బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న అదనపు నగదు నిల్వలు (సర్‌ప్లస్ లిక్విడిటీ) జూన్ 17 నాటికి భారీగా తగ్గి ₹4,772.21 కోట్లకు చేరుకున్నాయి. అంతకుముందు జూన్ 16న ఇవి ₹23,881.21 కోట్లుగా ఉన్నాయి. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ముందస్తు పన్నుల చెల్లింపులు (అడ్వాన్స్ టాక్స్ పేమెంట్స్) కారణంగా బ్యాంకింగ్ వ్యవస్థ నుండి పెద్ద ఎత్తున నగదు బయటకు వెళ్ళిపోవడమే ఈ క్షీణతకు ప్రధాన కారణం. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం.. జూన్ 17 నాటి ఈ నగదు స్థాయి, మార్చి 22, 2026 తర్వాత నమోదైన అత్యల్ప స్థాయిగా చెప్పవచ్చు. ఆ సమయంలో బ్యాంకింగ్ వ్యవస్థలో ఏకంగా ₹65,395.64 కోట్ల నగదు కొరత నమోదైంది.

ఇప్పటివరకు ₹1.89 లక్షల కోట్ల సరఫరా:

నగదు లభ్యతపై ఉన్న ఒత్తిడిని తగ్గించడానికి మరియు ఓవర్‌నైట్ మనీ మార్కెట్ రేట్లను అదుపులో ఉంచడానికి, సెంట్రల్ బ్యాంక్ గత కొన్ని రోజులుగా వివిధ కాలపరిమితుల వీఆర్‌ఆర్ (VRR) వేలం ద్వారా సుమారు ₹1.89 లక్షల కోట్ల తాత్కాలిక నగదును మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో జూన్ 18న జరిగిన రెండు వేలాల ద్వారా ₹72,300 కోట్లు, జూన్ 16న జరిగిన ఏడు రోజుల వీఆర్‌ఆర్ వేలం ద్వారా ₹89,440 కోట్లు మరియు జూన్ 15న ఓవర్‌నైట్ వేలం ద్వారా అందించిన ₹28,220 కోట్లు ఉన్నాయి.

ఈ వేలం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి?

బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు కొరత ఏర్పడినప్పుడు, బ్యాంకుల వద్ద ప్రజలకు లేదా వ్యాపారాలకు రుణాలు (లోన్స్) ఇవ్వడానికి తగినంత డబ్బు ఉండదు. అలాంటి పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ తన వద్ద ఉన్న నిధులను బ్యాంకులకు అందిస్తూ బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీని మెరుగుపరుస్తుంది. బ్యాంకులు ఈ నిధులను తమ తక్షణ (తాత్కాలిక) అవసరాలను తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటాయి. దీనికి ప్రతిఫలంగా బ్యాంకులు ఆర్‌బీఐకి నిర్ణీత వడ్డీని చెల్లిస్తాయి. ఆ తర్వాత కాలంలో బ్యాంకుల వద్ద మళ్లీ డిపాజిట్లు లేదా నగదు నిల్వలు పెరిగినప్పుడు, ఈ సొమ్మును తిరిగి ఆర్‌బీఐకి చెల్లిస్తాయి.


Posted

in

by

Tags: