పుణేలోని ఒక స్వీట్ షాప్లో సమోసాలు కొనేందుకు క్యూ లైన్లో ఏర్పడిన వివాదం ముదిరి, ఒక ఉద్యోగిపై తీవ్రంగా దాడి చేసిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.
శిరూర్ తాలూకా, కరేగావ్ గ్రామంలోని ‘శివశక్తి స్వీట్ హోమ్’ అనే దుకాణంలో సాయంత్రం వేళ ఈ ఘటన జరిగింది. అక్కడ పనిచేసే రాజు లాపూరామ్ దేవాసి (26) డ్యూటీలో ఉన్న సమయంలో.. ఈశ్వర్ రంగనాథ్ నావలే, సాయి లక్ష్మణ్ నావలే అనే ఇద్దరు వ్యక్తులు దుకాణానికి వచ్చారు. తాము డబ్బులు చెల్లించి చాలా సేపు వేచి ఉన్నప్పటికీ తమకు సమోసాలు ఇవ్వకుండా, ఇతరులకు ముందుగా ఇచ్చారంటూ వారు ఉద్యోగితో గొడవకు దిగారు.
ఈ చిన్నపాటి వాగ్వాదం కాస్తా క్షణాల్లో ఘర్షణగా మారింది. ఆ ఇద్దరు వ్యక్తులు ఉద్యోగిపై దాడి చేసి, బూతులు తిడుతూ తీవ్రంగా బెదిరించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు ఇంటర్నెట్లో వేగంగా వైరల్ అవుతుండటంతో, జనాలు షాక్కు గురవుతున్నారు.
ఈ ఘటనపై దుకాణ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంజన్గావ్ ఎంఐడీసీ (MIDC) పోలీసులు కేసు నమోదు చేసి, ఆ ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఒక సమోసా ప్లేట్ కోసం జరిగిన ఈ దాడి ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. చిన్నపాటి వివాదాలు ఎంత దారుణమైన హింసకు దారితీస్తున్నాయనే దానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తోంది. పోలీసులు ఈ విషయమై తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.
