ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న 5 ఏళ్ల బాలుడు, శౌచాలయానికి వెళ్లడానికి అనుమతి కోరగా టీచర్ నిరాకరించడంతో తరగతి గదిలోనే మూత్ర విసర్జన చేశాడు.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన టీచర్, ఆ చిన్నారిని వేరే గదికి తీసుకెళ్లి గ్యాస్ స్టవ్ మీద కత్తిని వేడి చేసి చిన్నారి రహస్యాంగంపై కాల్చి దారుణంగా వేధించింది. అంతేకాకుండా ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ చిన్నారిని బెదిరించింది.
ఇంటికి వచ్చిన చిన్నారి తనకు జరిగిన ఘోరాన్ని కన్నీళ్లతో చెప్పడంతో, తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. కానీ, ప్రిన్సిపాల్ మరియు మేనేజర్ వారికి ఎలాంటి సహాయం చేయకపోగా బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో, న్యాయవాది అయిన చిన్నారి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ఈ దారుణానికి ఒడిగట్టిన టీచర్ మరియు పాఠశాల యాజమాన్యంపై తీవ్రంగా విచారణ జరుపుతున్నారు.

Leave a Reply