బీహార్ రాష్ట్రంలోని నలంద జిల్లా రాజ్గిర్ ప్రాంతంలో, పెళ్లి విషయమై జరిగిన వివాదంలో ఒక మహిళను ద్విచక్ర వాహనంపై సుమారు 100 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, నిందితుడు మరియు తాను చాలా కాలంగా ప్రేమించుకున్నామని, అతను తనను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి ఆ తర్వాత నిరాకరించాడని తెలిపింది.
సంఘటన జరిగిన రోజు ఇద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. అనంతరం, ఆ వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించగా, ఆ మహిళ వాహనాన్ని పట్టుకుని అడ్డుకోవడానికి ప్రయత్నించింది. కానీ, వాహనాన్ని నిలపని ఆ వ్యక్తి, వేగాన్ని పెంచి ఆ మహిళను రోడ్డుపై 100 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు. ఇందులో నియంత్రణ కోల్పోయిన ద్విచక్ర వాహనం రోడ్డుపై బోల్తా పడి ప్రమాదానికి గురైంది. ఈ వ్యవహారాన్ని అక్కడ ఉన్న ప్రజలు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, అది ప్రస్తుతం దావానంలా వ్యాపిస్తోంది.
నిందితుడు నవాడా జిల్లాకు చెందినవాడని, అతను ప్రభుత్వ కార్యాలయంలో ల్యాండ్ సర్వేయర్గా పనిచేస్తున్నాడని తేలింది. వాహనం బోల్తా పడగానే, అక్కడ ఉన్న స్థానిక ప్రజలు అతడిని తరుముకుని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఆ వీడియోలో, ఆ వ్యక్తి “ఈమె నా భార్యే, ఇది మా వ్యక్తిగత విషయం” అని అరిచడం వినబడుతోంది. కానీ, పోలీసుల ప్రాథమిక విచారణలో వీరిద్దరూ ప్రేమించుకున్నారనేది మాత్రమే నిరూపణ అయింది.
పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడమే ఈ ఘర్షణకు ప్రధాన కారణమని రాజ్గిర్ పోలీసులు తెలిపారు. బాధితురాలు నవాడా జిల్లాలోని పోలీస్ స్టేషన్లో దీనిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తీవ్రంగా విచారణ జరుపుతున్నారు. విచారణ అనంతరం తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Leave a Reply