బెంగళూరులోని ఉత్తరహళ్ళి ప్రాంతంలో నివసిస్తున్న 13 ఏళ్ల బాలుడు గత జూలై 27వ తేదీ నుండి మాయమవ్వడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
ఏడవ తరగతి చదువుతున్న ఆ విద్యార్థి, ఇల్లు వదిలి సైకిల్పై బయటకు వెళ్లిన తర్వాత ఇప్పటివరకు ఇంటికి తిరిగి రాలేదు. పలు ప్రాంతాల్లో వెతికినా ఎలాంటి సమాచారం లభించకపోవడంతో, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ బాలుడికి చేపల పెంపకంపై ఎక్కువ ఆసక్తి ఉండేదని తెలుస్తోంది. కొన్ని వారాల క్రితం కూడా ఇంటికి చేపలను తీసుకువచ్చినప్పుడు, అనవసరంగా డబ్బు ఖర్చు చేయవద్దని తండ్రి హెచ్చరించారు. అప్పట్లో కలిగిన మనస్తాపంతో బాలుడు ఇల్లు వదిలి వెళ్లగా, కుటుంబ సభ్యులు అతడిని వెతికి మళ్లీ ఇంటికి తీసుకువచ్చి సర్దిచెప్పినట్లు సమాచారం వెలువడింది.
ఈ క్రమంలో, జూలై 27వ తేదీన స్కూల్ ముగిసి ఇంటికి తిరిగి వచ్చిన బాలుడు మళ్లీ చేపలను కొనుగోలు చేసి తీసుకువచ్చాడు. ఇది చూసిన తండ్రి తీవ్ర ఆగ్రహానికి గురై అతడిని మందలించడంతో పాటు కొట్టాడని, ఆ తర్వాత ట్యూషన్కు వెళ్లమని చెప్పి పనికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన బాలుడిని తీవ్ర మనోవేదనకు గురిచేసిందని చెబుతున్నారు.
సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో సైకిల్పై ఇల్లు వదిలి వెళ్లిన ఆ బాలుడు, రాత్రి సమయమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బంధువులు, స్నేహితులు, పాఠశాల సహా పలు చోట్ల వెతికినా ఎలాంటి సమాచారం లభించకపోవడంతో, తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మాయమైన బాలుడిని కనిపెట్టడానికి పోలీసులు వివిధ కోణాల్లో విచారణ జరిపి, తీవ్ర గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Leave a Reply