పాకిస్తాన్లో రాజకీయ నాయకులకు, ఉగ్రవాదులకు నడుమ ఉన్న రహస్య బంధం మరోసారి వెలుగులోకి వచ్చింది.
ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో హోం మంత్రిగా పనిచేసిన పాకిస్తాన్ సీనియర్ రాజకీయ నాయకుడు షేక్ రషీద్ అహ్మద్, నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా నాయకులతో ఒకే వేదికను పంచుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తీవ్ర కలకలం రేపుతోంది.
ఆ వైరల్ వీడియోలో షేక్ రషీద్ అహ్మద్ లష్కరే తొయిబా సీనియర్ కమాండర్, పాకిస్తాన్ మర్కాజీ ముస్లిం లీగ్ అధ్యక్షుడు ఖాలిద్ మసూద్ సంధు మరియు ఆ ఉగ్రవాద సంస్థ కేంద్ర సలహా మండలి సభ్యుడు ఖారీ మహమ్మద్ యాకూబ్ షేక్లతో కలిసి ఒకే వేదికపై కూర్చుని ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక బహిరంగ సభలో ప్రసంగించిన రషీద్, “నేను హఫీజ్ సాహెబ్ బానిసను” అని బహిరంగంగా వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా, తాను అమెరికాలో ఉన్నప్పుడు హఫీజ్ సయీద్ ఫోన్ నంబర్ తన మొబైల్కు వచ్చిందని, అందుకే తనను అమెరికా నుంచి పంపించివేశారని ఆయన వివరించగా, సభలోని జనాలు కేరింతలు కొట్టారు. “మేము పాకిస్తాన్తో పాటు హఫీజ్ సయీద్తో కూడా ఉన్నాము” అని ఆయన నినాదాలు చేశారు.
హఫీజ్ సయీద్ను ప్రశంసించడమే కాకుండా, భారత్కు వ్యతిరేకంగా నిరంతరం విషం చిమ్ముతూ, హింసను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు షేక్ రషీద్. పాకిస్తాన్ వైపు భారత్ “ఒకసారి కన్నుఎత్తి చూసినా” దేవుడే భారత్ను నాశనం చేస్తాడని ఆయన బెదిరింపులకు దిగారు. అంతేకాకుండా, “భారత్లో ఏ పక్షీ కూయదు, గుడులలో గంటలు కూడా మోగవు” అంటూ క్రూరమైన పదాలతో భారత్పై తన కక్షను వెళ్లగక్కారు.
అవామీ ముస్లిం లీగ్ పార్టీ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు అయిన షేక్ రషీద్, గత 2020 నుండి 2022 వరకు ఇమ్రాన్ ఖాన్ మంత్రివర్గంలో దేశ హోం మంత్రిగా సేవలందించడం గమనార్హం. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక వ్యక్తి బహిరంగంగా ఒక అంతర్జాతీయ ఉగ్రవాదికి తన మద్దతు తెలిపేలా మాట్లాడటం, పొరుగు దేశాన్ని బెదిరించడం వంటి ఈ ఘటన ప్రపంచ వేదికపై పాకిస్తాన్ ఉగ్రవాద ముఖాన్ని మళ్లీ నిలువెత్తునా ఆవిష్కరించింది.

Leave a Reply