ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడాలో ఒక యువకుడి వద్ద ఉన్న కొత్త మొబైల్ ఫోన్ అకస్మాత్తుగా తీవ్రంగా వేడెక్కి పేలిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
డాన్కూర్ ప్రాంతానికి చెందిన మజిత్ అనే యువకుడు పని నిమిత్తం ఘజియాబాద్ వెళ్లే వచ్చి తన గ్రామానికి తిరిగి వస్తున్నాడు. ఆ సమయంలో అతడు తన ప్యాంట్ జేబులో మొబైల్ ఫోన్ ఉంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రయాణంలో మధ్యలో మొబైల్ ఫోన్ మామూలు కంటే చాలా ఎక్కువగా వేడెక్కడంతో అతడు షాక్కు గురయ్యాడు.
కాసేపటికే ఫోన్ నుంచి పొగలు రావడం మొదలైందని మజిత్ తెలిపాడు. ఏం జరుగుతుందో ఆలోచించేలోపే ఆ మొబైల్ ఫోన్ అకస్మాత్తుగా పెద్ద శబ్దంతో పేలిపోయిందని సమాచారం. దీనివల్ల అతడు ధరించిన దుస్తులకు నిప్పంటుకుందని తెలుస్తోంది. ఊహించని సమయంలో జరిగిన ఈ ప్రమాదంతో మజిత్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. చుట్టుపక్కల ఉన్నవారు వెంటనే స్పందించి అతడికి సహాయం చేసి ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో మజిత్ రెండు చేతులకు, శరీరం దిగువ భాగానికి తీవ్రమైన కాలిన గాయాలైనట్లు వెల్లడైంది. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అకస్మాత్తుగా సెల్ఫోన్ ఎలా పేలిపోయిందనే దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫోన్ తీవ్రంగా వేడెక్కడాన్ని ముందే గమనించినప్పటికీ, దాన్ని జేబులోంచి బయటకు తీసేలోపే పేలిపోయిందని మజిత్ చెప్పాడు.
మజిత్ ఉపయోగిస్తున్న ఈ సెల్ఫోన్ను ఈ ఘటన జరగడానికి సుమారు ఒక నెల క్రితమే గ్రేటర్ నోయిడాలోని ఒక షాప్లో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కొత్తగా కొన్న ఫోన్ ఇలా పేలిపోవడం అతని కుటుంబ సభ్యుల్లో తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది. ఈ ఘటనకు సంబంధించి ఫోన్ నాణ్యత, పేలుడుకు గల కారణాలపై తగిన విచారణ జరిపించాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.

Leave a Reply