ఢిల్లీ పరిధిలో జరిగినట్లు భావించిన ఒక సాధారణ రోడ్డు ప్రమాదం కేసులో సంచలన ట్విస్ట్ వెలుగుచూసింది.
మృతి చెందిన దీపక్ అనే యువకుడిని పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పోలీసుల వివరాల ప్రకారం… జూలై 2వ తేదీన తెల్లటి హ్యుందాయ్ కారుతో దీపక్ వెళ్తున్న స్కూటీని ఢీకొట్టి ప్రమాదం సృష్టించారు. ఆ ప్రమాదం నుంచి అతడు తృటిలో ప్రాణాలతో బయటపడగా, ఆ తర్వాత మరోసారి అతడినే టార్గెట్ చేసినట్లు విచారణలో తేలింది.
జూలై 16న రోడ్డు పక్కన దీపక్ విగతజీవిగా పడి ఉండటం స్థానికులు గుర్తించారు. సంఘటన స్థలానికి దాదాపు 100 మీటర్ల దూరంలో అతడి స్కూటీ పడి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి పరిస్థితులు మరియు మృతదేహంపై ఉన్న తీవ్ర గాయాలను పరిశీలించిన పోలీసులకు ఇది సాధారణ యాక్సిడెంట్ కాదన్న బలమైన అనుమానం వచ్చింది. దీంతో అంతకుముందు జరిగిన ప్రమాద వివరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించగా, కేసు విచారణ సరికొత్త మలుపు తిరిగింది.
మొదటిసారి హత్యాయత్నానికి వాడిన కారును సాగర్ అనే వ్యక్తి నడిపినట్లు పోలీసుల విచారణలో తేలింది. అతడిని ప్రశ్నించిన తర్వాత, జూలై 16న దీపక్ను ఢీకొట్టి చంపడానికి ఉపయోగించిన స్కార్పియో (Scorpio) వాహనాన్ని కూడా పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీపక్ మరియు పవన్ అలియాస్ జగ్పాల్ దాబాస్ మధ్య ఉన్న పాత కక్షల కారణంగానే ఈ కిరాతక హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ కేసులో పవన్ అలియాస్ జగ్పాల్ దాబాస్, సాగర్ అలియాస్ కాలా, అతుల్, సాహిల్ మరియు ప్రిన్స్ అలియాస్ టిల్లు అనే ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన రెండు వాహనాలతో పాటు రెండు సెల్ఫోన్లను కూడా సీజ్ చేశారు. మొదట సాధారణ రోడ్డు ప్రమాదంగా కనిపించిన ఘటన, చివరకు పక్కా ప్రణాళికతో చేసిన కుట్రపూరిత హత్యగా తేలడం తీవ్ర కలకలం రేపింది.

Leave a Reply