పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నడిరోడ్లపై జనం ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడులు చేసుకుంటున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఆ దృశ్యాలలో కొందరు గుంపులుగా చేరి బాహాబాహీకి దిగడం, ఒకరిపై ఒకరు సీసాలు విసురుకుంటూ భయానక వాతావరణం సృష్టించడం కనిపించింది. దీంతో ప్రధాన రహదారులపై తీవ్ర గందరగోళం, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వీడియోలను చూసిన నెటిజన్లు పబ్లిక్ ప్రదేశాలలో ప్రజలు ప్రవర్తించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్వాతంత్య్ర దినోత్సవం వంటి ఎంతో పవిత్రమైన జాతీయ పర్వదినాన శాంతియుతంగా, ఆనందంగా వేడుకలు జరుపుకోవాల్సింది పోయి ఇలాంటి హింసాత్మక గొడవలకు దిగడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పౌరులు తమ భద్రతతో పాటు ఇతరుల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు వేడుకల అసలు ఉద్దేశాన్నే దెబ్బతీస్తున్నాయని విమర్శిస్తున్నారు.
ఈ ఘటనలను తప్పుపడుతూ పలువురు సోషల్ మీడియా యూజర్లు ‘Jashn-e-Jahalat’ (అజ్ఞానపు వేడుకలు) అనే పదంతో తమ నిరసనను వ్యక్తం చేశారు. జాతీయ దినోత్సవ వేడుకలు ఎంతో క్రమశిక్షణతో, హుందాగా జరగాలని చాలామంది అభిప్రాయపడ్డారు.
అంతేకాకుండా ఇలాంటి అల్లర్ల కారణంగా బహిరంగ ప్రదేశాలలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోందని, అందుకే ఇలాంటి వేడుకల్లో మహిళలు పెద్దగా కనిపించలేకపోతున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.

Leave a Reply