హైదరాబాద్లో ఇంటి తాళం పగలగొట్టి బంగారు నగలు అపహరించిన ఓ దొంగ, పారిపోవడానికి బదులు అదే ఇంట్లో నిద్రపోయిన విచిత్ర ఘటన తీవ్ర కలకలం రేపింది.
అదే ప్రాంతానికి చెందిన సదరు వ్యక్తి, గంజాయి మత్తులో దొంగతనం చేసే ఉద్దేశంతో ఆ ఇంట్లోకి చొరబడ్డాడు. బీరువాలోని బంగారు నగలను దొంగిలించి జేబులో పెట్టుకున్న అతను, అక్కడి నుంచి పారిపోకుండా మత్తు కారణంగా ఆ ఇంటి గదిలోనే కుప్పకూలిపోయి గాఢనిద్రలోకి జారుకున్నాడు.
బయటకు వెళ్లిన ఇంటి యజమానులు తిరిగి రాగానే, బీరువా తెరిచి ఉండటం, వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండటం చూసి కంగుతిన్నారు. అంతేకాకుండా గది నేలపై గుర్తుతెలియని వ్యక్తి ఒకడు ప్రశాంతంగా నిద్రపోతుండటాన్ని గమనించారు. వాడి జేబులను తనిఖీ చేయగా, దొంగిలించిన బంగారు నగలు దొరికాయి.
వెంటనే వాడిని నిద్రలేపకుండా, ఈ విచిత్రమైన తతంగాన్ని ఇంటి యజమానులు తమ మొబైల్ ఫోన్లో వీడియో తీశారు. అనంతరం ఈ విషయంపై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మత్తులో నిద్రపోతున్న ఆ దొంగను అరెస్ట్ చేసి, వాడి వద్ద ఉన్న బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆ వ్యక్తికి మరేదైనా దొంగతనాలతో సంబంధం ఉందా అనే కోణంలో ముమ్మర విచారణ జరుపుతున్నారు.

Leave a Reply