భార్యాభర్తల మధ్య గొడవలను సర్దిచెప్పేందుకు వెళ్లిన ఒక గుడి పూజారి, స్నేహితుడికే వెన్నుపోటు పొడిచి ఒక వివాహిత జీవితంతో ఆడుకున్న కిరాతక ఘటన ధర్మపురి ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.
ధర్మపురి జిల్లా పాప్పిరెడ్డిపట్టి సమీపంలోని ఒక గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువతికి రెండేళ్ల క్రితం వివాహమై, ఒక బాబు ఉన్నాడు. ఆమె ఫార్మసీ చదువుకుంటూనే స్థానిక ఆసుపత్రిలో శిక్షణ పొందుతోంది. ఆమె భర్త సీసీటీవీ కెమెరాలు బిగించే పనులు చేస్తుంటాడు.
ఈ దంపతుల మధ్య తరచూ మనస్పర్థలు వస్తుండటంతో, భర్తకు అత్యంత సన్నిహితుడైన రఘురామ్ (28) అనే ఆలయ పూజారి ఇంట్లో పంచాయితీ పెట్టి ఇద్దరినీ సయోధ్య చేసేవాడు. స్నేహితుడి కాపురాన్ని చక్కదిద్దుతున్నట్లు నటించిన ఆ పూజారి, క్రమంగా ఆ యువతిపై కన్నేశాడు.
కొన్ని నెలల క్రితం కళాశాల ముగించుకుని వస్తున్న ఆ యువతిని బలవంతంగా తన కారు ఎక్కించుకున్న రఘురామ్, కారులో ఆమెతో సన్నిహితంగా ఉన్న కొన్ని ఫొటోలను రహస్యంగా తీశాడు. “నా కోరిక తీర్చకపోతే మన మధ్య అక్రమ సంబంధం ఉందని ఊరంతా ప్రచారం చేస్తా” అంటూ ఆ ఫొటోలను చూపిస్తూ ఆమెను బెదిరించి లొంగదీసుకున్నాడు.
అంతటితో ఆగకుండా ఏకాంత సమయంలో తీసిన వీడియోలను చెన్నైలోని తన స్నేహితుడికి పంపించాడు. ఆ తర్వాత చెన్నైలోని వ్యక్తి కూడా ఆ యువతిని కాంటాక్ట్ చేసి, “వీడియో కాల్లో నగ్నంగా మాట్లాడకపోతే ఈ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టేస్తాం” అని బ్లాక్మెయిల్ చేసి నగ్నంగా వీడియో కాల్ మాట్లాడించాడు. ఆ వీడియోను కూడా స్క్రీన్ రికార్డ్ చేసుకున్నారు.
తర్వాత ఆ కేటుగాళ్లు మరిన్ని అసభ్యకరమైన డిమాండ్లు చేస్తూ భర్తకు వీడియోలు పంపుతామని బెదిరించడంతో, ఆ యువతి ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆలయ పూజారి రఘురామ్ను అరెస్ట్ చేశారు. ఈ కుట్రలో భాగమైన చెన్నై నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు.
